శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 డిశెంబరు 2020 (17:14 IST)

కలియుగ కర్ణుడు - సాయం చేయడానికి ఆస్తులు తాకట్టుపెటిన సోను సూద్?

కరోనా మహమ్మారి వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రం మార్చి నెలాఖరులో లాక్డౌన్ అమలు చేసింది. ఈ లాక్డౌన్ కారణంగా దేశం యావత్తూ స్తంభించిపోయింది. ఆ సమయంలో అనేక మంది వలస కూలీలు తీవ్ర అగచాట్లు పడ్డారు. విదేశాల్లోని లక్షలాది మంది భారతీయులు కూడా కష్టాలు పడ్డారు.

ఇలాంటి వారిని ఆదుకునేందుకు కష్టకాలంలో ముందుకు వచ్చిన వెండితెర విలన్, రియల్ హీరో సోను సూద్. ఈయన నిజ జీవితంలో ఎంతో మంది అపన్నులకు ఆపద్బాంధవుడిగా నిలిచారు. కరోనా లాక్డౌన్ సమయంలో ప్రభుత్వాలు కూడా చేయలేని పనులను ఆయన చేశారు. వలస కార్మికులను వారి ఊళ్లకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.
 
మరోవైపు విదేశాలలో చిక్కుకుపోయిన వారికి విమానాలను కూడా ఏర్పాటుచేశారు. పలువురికి విద్య, వైద్య ఖర్చులు భరించారు. ఎవరు ఏ సాయం అడిగినా కాదనకుండా తన వంతు సహాయం చేసేందుకు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. 
 
కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటూ, స్టార్ హీరోలుగా వెలిగిపోయేవారు కూడా చేయలేని పనులను సోను చేశారు. ఈ నేపథ్యంలో, సోనూకు దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఏర్పడ్డారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. తెలియని విషయం ఏమిటంటే... ప్రజలకు సాయం చేయడం కోసం సోను తన ఆస్తులను కూడా తాకట్టు పెట్టారు.
 
రూ.10 కోట్లను పోగు చేయడం కోసం ముంబైలో తనకు గల ఎనిమిది ఆస్తులను ఆయన తాకట్టు పెట్టారు. ఇందులో ఆరు ఫ్లాట్లు, రెండు దుకాణాలు ఉన్నాయి. ఈ సందర్భంగా వెస్ట్ ఇండియా రెసిడెన్సియల్ సర్వీసెస్ సీనియర్ డైరెక్టర్, హెడ్ రితేశ్ మెహతా మాట్లాడుతూ, ఎదుటి వారి కోసం ఇంత గొప్ప పని చేసిన వారిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని తెలిపారు.