గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 నవంబరు 2020 (14:26 IST)

రాజ్యసభ సభ్యులుగా మహామహులు పని చేశారు... చిన్నచూపు చూడకండి!

కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ మరోమారు విమర్శలు చేశారు. రాజ్యసభ సభ్యులను చిన్నచూపు చూడొద్దని ఆయన హితవు పలికారు. మాజీ ప్రధానమంత్రులు ఇందిరా గాంధీ, వాజ్‌పేయితో పాటు సీనియర్ నేతలు సోమ్‌నాథ్ ఛటర్జీ, ఎల్కే.అద్వానీ వంటి మహామహులు రాజ్యసభ సభ్యులుగా చేసినవారేనని ఆయన గుర్తుచేశారు.
 
గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ పనితీరు తీవ్ర నిరాశకు గురి చేస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, పార్టీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతుండటం ఆ పార్టీ హైకమాండ్‌ను దిక్కుతోచని స్థితిలోకి కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు పార్టీ అగ్రనాయకత్వం ఆలోచనా విధానంలో మార్పు రావాలని పార్టీకి చెందిన 23 మంది సీనియర్లు గత ఆగస్టులో రాసిన లేఖ కలకలం రేపింది.
 
ఈ సీనియర్లలో ఎక్కువ మంది రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నవారే. బీహార్ ఎన్నికల తర్వాత కూడా కపిల్ సిబాల్, గులాం నబీ అజాద్ వంటి నేతలు మరోసారి తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తమ నేతలకు ఓ సూచన చేసింది. నామినేటెడ్ రాజ్యసభ సభ్యులు పార్టీ క్రమశిక్షణకు లోబడి నడుచుకోవాలని హెచ్చరించింది. పార్టీ అంతర్గత వ్యవహారాలపై గీత దాటి మాట్లాడవద్దని తెలిపింది.
 
దీనిపై కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ స్పందిస్తూ, ఎవరిని చిన్న చూపు చూస్తున్నారన్నారు. మన దేశంలోని గొప్ప నేతలు ఏదో ఒక సమయంలో రాజ్యసభ సభ్యులుగా పని చేసినవారేనని చెప్పారు. ఇందిరా గాంధీ, వాజ్‌పేయి, సోమ్‌నాథ్ ఛటర్జీ, అద్వానీ వంటి మహామహులు రాజ్యసభ సభ్యులుగా పని చేసినవారేనని అన్నారు. 
 
రెండు చట్ట సభలు ఉండాలని రాజ్యాంగ రూపకర్తలు చెప్పారని ఆనంద్ శర్మ చెప్పారు. మన దేశం ఓ యూనియన్ అని... అన్ని రాష్ట్రాలకు రాజ్యసభ ప్రాతినిథ్యం వహిస్తుందన్నారు. రాజ్యసభ సభ్యులందరూ ఎన్నికైనవారేనని... నామినేట్ అయిన వారు కాదని చెప్పారు. ముఖ్యమైన బిల్లులను తొలుత రాజ్యసభలోనే ప్రవేశపెడతారని అన్నారు.