ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్
పదవులు లేదా ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదని అగ్రహీరో కమల్ హాసన్ అన్నారు. మణిరత్నం దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం థగ్లైఫ్. జూన్ 5వ తేదీన విడుదలకానుంది. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శనివారం చెన్నై వేదికగా జరిగింది. ఇందులో పాల్గొన్న కమల్ హాసన్ సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు.
తాము గొప్ప సినిమా రూపొందించామని.. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం తన రాజకీయ జీవితంపై మాట్లాడారు. పదవుల మీద వ్యామోహంతో తాను రాజకీయాల్లోకి రాలేదు, ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు. తమిళనాడు రాష్ట్ర ప్రజలకు నా వంతు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చా.
ప్రజల కోసం మేము వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం. నిదానంగా అనుకున్నది సాధిస్తాం. ఈ ప్రయాణంలో నాతో భాగమైన వారికి ధన్యవాదాలు. వాళ్లు అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. అందుకు నేనెంతో గర్వపడుతున్నా. శింబు మీరు కూడా మీ వాళ్ల కోసం నిలబడాలి. వాళ్లను అలరించడం కోసం మరింత శ్రమించాలి. మా సినిమా 'థగ్ లైఫ్' విషయంలో నమ్మకంగా ఉన్నాం. ప్రేక్షకులు తప్పకుండా మా చిత్రాన్ని ఆదరిస్తారు. శాటిలైట్, ఓటీటీ హక్కులు మాత్రమే బయటవాళ్లకు అమ్మాను.
డిస్ట్రిబ్యూషన్ మేమే చేస్తున్నాం. మేము ఒక మంచి చిత్రాన్ని రూపొందించాం. ప్రేక్షకులు ఆదరిస్తే.. మా నిర్మాణ సంస్థలో ఇలాంటి ఎన్నో గొప్ప చిత్రాలను రూపొందిస్తాం. ఈ సినిమాలో మలయాళ నటుడు జోజూ జార్జ్ కీలక పాత్ర పోషించారు. నటీనటులు ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే.. వారిని నేను పోటీగా తీసుకుంటా. కానీ, జోజూ విషయంలో మాత్రం అసూయ ఫీలవుతుంటా. ఆయన అద్భుతంగా వర్క్ చేస్తుంటారు. ఏది ఏమైనా నటీనటులను స్వాగతించాల్సిన బాధ్యత నాపై ఉంది" అని కమల్ హాసన్ అన్నారు.