1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 జనవరి 2022 (18:39 IST)

ఆ 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు సుప్రీంలో ఊరట

మహారాష్ట్ర అసెంబ్లీలో సస్పెండ్‌కు గురైన 12 మంది భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. వీరి సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం రద్దు చేసింది. ఈ చర్య ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధం, చట్టవిరుద్ధమని పేర్కొంటూ రూలింగ్ ఇచ్చింది. 
 
మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 12మందిపై స్పీకర్ ఒక ఏడాది పాటు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన అపెక్స్ కోర్టు ఈ సస్పెన్షన్ ఆదేశాలను రద్దు చేసింది. 
 
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం కుదరదని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ తీర్మానాలు చట్టం దృష్టిలో దురుద్దేశపూరితమైనవి, అసమర్థమైనవి, అసెంబ్లీ అధికార పరిధికి లోబడి లేవని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 
 
గత ఏడాది, మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా, అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్‌లో ప్రిసైడింగ్ అధికారితో దురుసుగా ప్రవర్తించినందుకు 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాది పాటు సస్పెండ్ చేసిన విషయం తెల్సిందే.ే