మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

కాలేజీ స్నేహితురాలిని పెళ్లి చేసుకోవాలని.. ఆమె భర్తను హత్య చేశాడు..

knife
మహారాష్ట్రలోని ముంబై నగరంలో దారుణం జరిగింది. తనతో పాటు కాలేజీలో చదివిన స్నేహితురాలిని పెళ్లి చేసుకోవాలని ఓ యువకుడు భావించాడు. కాలేజీ పూర్తయిన తర్వాత అది సాధ్యపడలేదు. కానీ, ఆమెపై తన వ్యామోహం కూడా తీరలేదు. దీంతో వివాహమైన తర్వాత కూడా ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ఆమె భర్తను హత్య చేశాడు. చివరకు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. 
 
పోలీసుల కథనం మేరకు ముంబై శాంతాక్రూజ్‌లోని గోలీబార్ నగర్‌కు చెందిన అకీల్ సయ్యద్, షాజహాన్ అనేవారు యుక్త వయసులో ఒకే కాలేజీలో చదువుకున్నారు. తనను పెళ్లి చేసుకోవాలంటూ షాజహాన్ వెంటపడేవాడు. ఒకవేళ తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే కట్టుకున్న భర్తను చంపేస్తానని పలుమార్లు బెదిరించాడు. చివరకు అన్నంత పని చేశాడు. 
 
షాజహాన్‌కు ఆమె తల్లిదండ్రులు థానేలోని రోల్డ్ గోల్డ్ వ్యాపారం చేసే పర్వేజ్ బషీర్ షేక్‌తో వివాహం చేశారు. అదే సమయంలో సయ్యద్‌కు కూడా వివాహమైంది. అయినప్పటికీ షాజహాన్‌పై ప్రేమను చంపుకోలేక పోయాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ వేధించసాగాడు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు కూడా చెప్పింది. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పటికీ షాజహాన్‌ను వేధించడం వదిలిపెట్టలేదు. 
 
ఈ క్రమంలో మాట్లాడుకుందాం రమ్మని సయ్యద్‌ను పర్వేజ్ పిలిచాడు. వారిద్దరి మధ్య జరిగిన మాటలు పోట్లాటకు దారితీశాయి. అప్పటికే పర్వేజ్‌ను హత్య చేయాలన్న ఉద్దేశ్యంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో సయ్యద్ విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో పర్వేజ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. మృతుడు భార్య షాజహాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వకోలా పోలీసులు హత్య కేసు నమోదు చేసి సయ్యద్‌ను అరెస్టు చేశారు.