1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 3 మార్చి 2020 (17:52 IST)

నాతో పెళ్లికి వాయిదా వేస్తావా అంటూ నోట్లో విషం పోసి చున్నీతో బిగించాడు

పెళ్ళికి వాయిదా వేస్తుందనే నెపంతో, ప్రేమించిన ప్రియురాలి పైన అత్యంత పాశవికమైన దాడి జరిగింది. సగటు అమ్మాయిలు ప్రేమంటే భయపడే ఈ అమానుష సంఘటన తమిళనాడులో జరిగింది. అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదనే ఉద్దేశంతో ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు. తమిళనాడు, కోయంబత్తూరు నగరంలో జరిగిన ఈ సంఘటన తమిళనాట కలకలం రేపింది.
 
21 ఏళ్ళ యువతి, గవర్న్‌మెంట్ ఆర్ట్స్‌ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. కోయంబత్తూరు సమీపంలోగల గణపతి అనే ప్రాంతానికి చెందిన దినేష్‌ అనే యువకుడు కాలేజీ పక్కనే ఓ ఫ్యాన్సీ దుకాణం నడుపుతున్నాడు. వీరి ఇరువురి మధ్య స్కూల్‌డేస్ నుంచి ప్రేమ వ్యవహారం వున్నట్లు స్థానికుల సమాచారం.

దినేష్ టార్చర్ భరించలేని సదరు యువతి అయిష్టంగానే అతడి ప్రేమను స్వీకరించింది. దినేష్‌ ఈ విషయాన్ని కాస్త, ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో పెళ్లికి అంగీకరించారు. అయితే వారు నందిని చదువు పూర్తి అయిన తర్వాతే వివాహం చేయాలనుకున్నారు. 
 
కానీ దినేష్‌ మాత్రం ఆమెను త్వరగా తనకిచ్చి పెళ్లి చేయాలంటూ బలవంతం చేస్తూ వచ్చాడు. అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో నందిని వివాహాన్ని వాయిదా వేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం నందిని ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దినేష్‌ లోపలికి ప్రవేశించాడు. వెళ్లడంతోనే హుటాహుటిన ఆమె నోట్లో బలవంతంగా విషం పోసి, చున్నీతో నోటిని గట్టిగా బిగించేసాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి అపస్మారక స్థితిలో ఉన్న కుమార్తెను చూసి కుప్పకూలిపోయారు. 
 
వెంటనే కోవై ప్రభుత్వాసుపత్రికి తరలించగా ఆదివారం ఉదయం ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు కూడా విషం తాగాడు. గమనించిన బంధువులు అతడిని ఆస్పత్రికి తరలించారు. నందిని పేరెంట్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు దినేష్‌పై కేసు నమోదు చేశారు.