ప్రియురాలికి రూ.3 కోట్లతో ఇంటిని నిర్మించిన చోర శిఖామణి!
చోరీలు చేసిన సొమ్ముతో తన ప్రియురాలికి అత్యంత ఖరీదైన ఇంటిని నిర్మించాడో దొంగ. ఆ ఇంటిలో పెట్టేందుకు రూ.22 లక్షల వ్యయం చేసే ఆక్వేరియంను బహుమతిగా ఇచ్చాడు. మొత్తంగా ఆ ఇంటి నిర్మాణం కోసం ఆ చోర శిఖామణి ఏకంగా రూ.3 కోట్ల మేరకు ఖర్చు చేసి ప్రతి ఒక్కరి మతిపోయేలా చేశాడు.
తాజాగా బెంగుళూరు పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన పంచాక్షరి స్వామి (37) అనే వ్యక్తి బాల్యం నుంచి చోరీలు చేసే అలవాటు ఉంది. దీంతో చోరీల్లో ఆరితేరిన దొంగగా తయారయ్యాడు. 2009 నాటికి ఘరానా దొంగగా మారి కోట్ల రూపాయలు సంపాదించాడు.
2014-15 సమయంలో ప్రముఖ సినీనటితో స్వామికి పరిచయం ఏర్పడింది. ఆమె కోసం కోట్లు ఖర్చు చేశాడు. అంతేకాదు, కోల్కతాలో మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఓ విలాసవంతమైన ఇంటిని నిర్మించి ఇచ్చాడు. అందులో పెట్టేందుకు రూ.22 లక్షల విలువైన ఆక్వేరియంను గిఫ్ట్ ఇచ్చాడు.
ఈ క్రమంలో 2016లో ఓ చోరీ కేసులో గుజరాత్ పోలీసులు స్వామిని అరెస్ట్ చేశారు. ఆ కేసులో ఆరేళ్ల జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. గతేడాది బెంగళూరుకు మకాం మార్చి తిరిగి దొంగతనాలు మొదలుపెట్టాడు. జనవరి 9న మడివాలా ప్రాంతంలో చోరీ చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు చెప్పింది విని పోలీసులు నోరెళ్లబెట్టారు.
బంగారం, వెండి ఆభరణాలను దొంగిలించే నిందితుడు స్వామి వాటిని కరిగించి బిస్కెట్లుగా మార్చేవాడు. అతడి నుంచి ఇప్పటివరకు 181 గ్రాముల బంగారం 333 గ్రాముల వెండి, పలు రకాల పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
కాగా, స్నేహితురాలికి రూ.3 కోట్లతో ఇల్లు కట్టించి ఇచ్చిన నిందితుడు తాను మాత్రం తల్లి ఇంట్లో ఉంటున్నాడు. ఆ ఇంటికి కూడా వాయిదాలు సరిగా చెల్లించకపోవడంతో బ్యాంకు వేలం నోటీసులు ఇచ్చింది. నిందితుడు పంచాక్షరి స్వామికి వివాహమై ఒక చిన్నారి కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.