మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 21 మే 2019 (12:13 IST)

చదవడం లేదనీ ఐదేళ్ళ బిడ్డను కొట్టి చంపిన తల్లి...

తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి జిల్లాలో దారుణం జరిగింది. చదవడం లేదని ఐదేళ్ల బిడ్డను కొట్టి చంపిందో కసాయి తల్లి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుచ్చి జిల్లా కాట్టుపుదూర్, పల్లివాసల్ గ్రామానికి చెందిన నిత్యకమలం (35), పాండ్యన్ (37) అనే దంపతులకు లతికా శ్రీ (5) అనే ఐదేళ్ళ కుమార్తె ఉంది. ఈమె స్థానికంగా ఉండే ఓ పాఠశాలలో ఒకటే తరగతి చదువుతోంది. అయితే, ఇంటికి వచ్చిన తర్వాత ఇరుగు పొరుగు పిల్లలతో కలిసి ఆటలకే పరిమితమవడం, పొద్దస్తమానం టీవీకి అతుక్కునిపోయి చదవడం లేదని పేర్కొంటూ లతికాశ్రీని తల్లి నిత్యకమలం తీవ్రంగా కొట్టింది. 
 
దీంతో ఆ చిన్నారి అపస్మారక స్థితిలోకి జారుకోవడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. చనిపోయినట్టు నిర్ధారించారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి.. తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలులోకి వచ్చింది. బిడ్డ చదవడం లేదన్న ఆగ్రహంతో కొట్టానని, ఆ దెబ్బలను తాళలేక పాప స్పృహ కోల్పోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు చెప్పింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.