1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 ఆగస్టు 2021 (11:45 IST)

ఆ టెస్టులో ఫెయిల్ అయితే మీ వాహనం ఇక తుక్కే...

ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమయ్యే వాహనం ఇకపై తుక్కుగా మారిపోతుంది. ఈ మేరకు కేంద్రం కార్యాచరణ మొదలుపెట్టింది. 1 ఏప్రిల్ 2023 నుంచి వాణిజ్య వాహనాలు, 1 జూన్ 2024 నుంచి వ్యక్తిగత వాహనాలకు ఇది వర్తిస్తుంది. కొత్త విధానంలో భాగంగా వాహనాలన్నీ తప్పనిసరిగా ఫిట్‌నెస్ పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో కనుక విఫలమైతే వాహనాలను తుక్కు కింద మార్చేస్తారు.
 
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాహనం ఫిట్‌నెస్ (దృఢత్వ) పరీక్షలో కనుక విఫలమైతే నెల రోజుల్లోపు మరో అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత కూడా విఫలమైతే వారం రోజుల్లోపు అప్పీలు చేసుకోవచ్చు. అక్కడ కూడా ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమైతే నమోదిత కేంద్రంలో వాహనాన్ని తుక్కు చేయాల్సి ఉంటుందనే కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. 
 
ప్రస్తుతం దేశంలో 15 ఏళ్ల సర్వీసు పూర్తయిన వాహనాలు కోటికిపైగానే ఉన్నాయి. వీటిని తుక్కు చేయడమే కొత్త విధానం ఉద్దేశం. వాటి స్థానంలో కొత్త వాహనాలు వస్తే భద్రత పెరగడంతోపాటు ఇంధనం, నిర్వహణ ఖర్చులు ఆదా అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ విధానం వల్ల కొత్తగా 35 వేల ఉద్యోగాలు వస్తాయి. ప్రభుత్వానికి రూ.10 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని తెలిపారు. 
 
ఇక కొత్త విధానంలో కొన్ని ప్రోత్సాహకాలను కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాత వాహనం రిజిస్టర్డ్ స్క్రాపింగ్ సెంటర్‌కు వెళ్తే వాహన యజమానికి డిపాజిట్ ధ్రువపత్రం లభిస్తుంది. కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు దానిని చూపిస్తే రిజిస్ట్రేషన్ రుసుము నుంచి మినహాయింపు లభిస్తుందని వెల్లడించారు. 
 
వ్యక్తిగత వాహనాలకైతే రోడ్డు ట్యాక్స్‌పై 25 శాతం, వాణిజ్య వాహనాలకు 15 శాతం రాయితీ లభిస్తుంది. వాణిజ్య వాహనాలకు 8 సంవత్సరాల వరకు, వ్యక్తిగత వాహనాలకు 15 ఏళ్ల వరకు ఈ రాయితీ లభిస్తుంది. ప్రతి జిల్లాలోను ఓ తుక్కు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.