శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 జులై 2021 (09:45 IST)

ఆంధ్రప్రదేశఅ‌లో మరో మూడు విమానాశ్రయాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు విమానాశ్రయాలు ఏర్పాటుకానున్నాయి. ఈ విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మూడు విమానాశ్రయాల్లో రాష్ట్రంలోని భోగాపురం, ఓర్వకల్లు, దగదర్తి విమానాశ్రయాలు ఉన్నాయి. వీటికి అనుమతులు ఇచ్చామని, వీటిలో ఓర్వకల్లు విమానాశ్రయంలో ఈ ఏడాది మార్చి నుంచే కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని కేంద్ర పౌరవిమానయాన సంస్థ తెలిపింది. 
 
లోక్‌సభలో గురువారం నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి జనరల్ వీకే సింగ్‌ పైవిధంగా సమాధానమిచ్చారు. అదేవిధంగా భోగాపురం విమానాశ్రయానికి రూ.2,500 కోట్లు, దగదర్తికి రూ.293 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్టు చెప్పారు. 
 
ఈ ఎయిర్‌పోర్టులను పీపీపీ/జాయింట్ వెంచర్ విమానాశ్రయాల ద్వారా 2020-21 వరకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రూ.30,069 కోట్లు సంపాదించినట్టు మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు. కన్సెషన్ ఫీజు రూపంలో హైదరాబాద్, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి 2020-21 కేంద్రానికి రూ.856 కోట్ల ఆదాయం వచ్చినట్టు వివరించారు. 
 
అలాగే, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అడిగిన మరో ప్రశ్నకు వీకే సింగ్ సమాధానమిస్తూ.. విమానాశ్రయాలు, టెర్మినల్ సముదాయాలకు కొత్త పేర్లు పెట్టడం, ఉన్న పేర్లు మార్చడం వంటి వాటిపై తీర్మానాలు పంపినప్పటికీ తుది నిర్ణయాధికారం మాత్రం కేంద్ర కేబినెట్‌దేనని స్పష్టం చేశారు.