1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 మే 2021 (10:30 IST)

కరోనా వైరస్ సోకి కేంద్ర మంత్రి కుమార్తె మృతి!

కరోనా వైరస్ మహమ్మారి ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. చిన్నాపెద్దా.. పేద, ధనిక అనే తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరినీ కాటేస్తుంది. ప్రాణాలు తీస్తుంది. ఈ వైరస్ సోకిన వారు ఆస్పత్రుల చుట్టు తిరిగినా ప్రాణాలు నిలబడని పరిస్థితి చాలాచోట్ల కనిపిస్తోంది. 
 
తాజాగా కేంద్ర మంత్రి టవర్ చంద్ గాహ్లాత్ కుమార్తె గోయిత సోలంకి కరోనా వైరస్ సోకి చనిపోయారు. ఆమె వయసు 42 సంవత్సరాలు. ఆమెకు కరోనా సోకిన తర్వాత ఉజ్జయినీలోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఫలితం లేకపోవడంతో పలు ఆసుపత్రులలో ఆమెకు చికిత్స చేయించడానికి ప్రయత్నించారు. 
 
అయినా, గోయిత సోలంకి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. దీంతో ఆమెను ఇండోర్‌లోని వేదాంతా ఆసుపత్రిలో చేర్పించారు. కానీ, అప్పటికే ఆమె ఊపిరితిత్తులు పాడైపోయాయి. దాదాపుగా 80 శాతం ఊపిరితిత్తులలో కరోనా వ్యాపించింది. దీంతో ఆమెను రక్షించాలేకపోయినట్టు ఆసుపత్రి డైరెక్టర్ సందీప్ శ్రీవాస్తవ వెల్లడించారు.
 
మరోవైపు, సోమవారం దేశంలో కరోనా రోగుల సంఖ్య 2 కోట్లు దాటింది. 20 మిలియన్లకు పైగా ప్రజలు సోకిన రెండవ దేశంగా భారతదేశం నిలిచింది. అమెరికాలో 3.38 కోట్ల మందికి ఇప్పటివరకూ కరోనా సోకింది. అమెరికా అగ్రస్తానంలో ఉంటే భారత్ రెండో స్థానానికి ఎగబాకింది. అలాగే, మరణాల సంఖ్యలోనూ.. అత్యధిక మరణాలు సంభవించిన దేశాలలో మెక్సికోను అధిగమించి భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 2 లక్ష 18 వేల 945 మంది ఇక్కడ మరణించారు.