శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 22 మే 2019 (17:17 IST)

వామ్మో.. మోడీ మళ్లీ వస్తారా? గ్రామం ఖాళీ చేయనున్న ముస్లింలు

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెల్లడికానున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముస్లింలు భయంతో వణికిపోతున్నారు. మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందనీ, ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపడుతారంటూ అనేక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనా వేశాయి. ఈ ఫలితాలను చూసిన ముస్లింలు భయంతో వణికిపోతున్నారు. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్ షహర్ జిల్లాలోని భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మైనార్టీలపై బీజేపీ కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నారు. ఈ తరహా దాడులు నయాబన్స్ గ్రామంలో ఎక్కువగా జరుగాయి. ఈ దాడులకు భయపడి అనేక మంది ముస్లిం కుటుంబాలు గ్రామాన్ని వీడి వెళ్లిపోయారు.
 
ఈ గ్రామంలో గత యేడాది అనేక హింసాత్మక సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో ఓ అధికారి, మరో పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా గ్రామంలో ప్రజలు హిందువులు, ముస్లింలుగా విడిపోయారు. దీంతో ఈసారి మోడీ గెలిస్తే తాము ఊరి విడిచిపెట్టి వెళ్లిపోతామని చాలా మంది ముస్లింలు చెబుతున్నారు.
 
ఈ విషయమై గ్రామస్తుడు ఒకరు మాట్లాడుతూ.. 'ఒకప్పుడు ముస్లిం, హిందూ పిల్లలు కలిసి ఆడుకునేవారు. పండుగలను కూడా కలిసే జరుపుకునేవాళ్లం. ఊరిలో ఎవరికైనా ఇబ్బంది వస్తే అందరం తోడుగా నిలిచేవాళ్లం. కానీ ఎప్పుడైతే బీజేపీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. హిందూ-ముస్లింల మధ్య అనుబంధం క్రమంగా తగ్గడం ప్రారంభమైంది.
 
ఎప్పుడైతే యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యారో పరిస్థితులు మరింతగా దిగజారాయి. హిందూ-ముస్లింలను విడదీయడమే ఆయన అజెండాగా పెట్టుకున్నారు. ఊరిలో 4,000 మంది ఉంటే మా సంఖ్య 400 మాత్రమే. ప్రస్తుతమున్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఊరిలో ఉండటం మంచిది కాదనిపిస్తోంది. ఆర్థిక స్తోమత ఉన్న కుటుంబాలు ఇప్పటికే ఊరు విడిచిపెట్టి వెళ్లిపోయాయి. ఈసారి కూడా బీజేపీ గెలిస్తే మిగిలిన కుటుంబాలు కూడా ఊరు విడిచిపెట్టి వెళతాయి' అని ఆయన ఆవేదనతో చెప్పుకొచ్చారు.