బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 13 జులై 2020 (20:43 IST)

కాన్పూర్ బ్రేకింగ్ న్యూస్: గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబె తండ్రి గుండెపోటుతో హఠాన్మరణం

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే తండ్రి రామ్ కుమార్ దూబే గుండెపోటుతో హఠన్మరణం చెందారు. కుమారుడు వికాస్ దూబే ఎన్ కౌంటర్లో మరణించిన నాటి నుండి రామ్ కుమార్ కన్నీరుమున్నీరై రోదిస్తున్నారు. ఈ క్రమంలో తీవ్రమైన మనోవ్యథకు గురైన రామ్ కుమార్ ఈరోజు గుండెపోటుతో కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే గతవారం గురువారంనాడు సాయంత్రం ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయంలో అరెస్టు చేసింది, అదే రోజు సాయంత్రం ఉజ్జయిని నుంచి యూపీలోని కాన్పూర్‌కు పోలీసులు బయలుదేరారు. మార్గమధ్యంలో ఓ మారు కొద్దిసేపు ఆగినట్టు పోలీసులు తెలిపారు. 
 
అయితే, వికాస్ దూబేను కాన్పూర్‌కు తీసుకుని వస్తున్నారని అతని అనుచరులకు తెలిసిందేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేసిన సదరు అధికారి, కాన్పూర్‌కు 40 కిలోమీటర్ల దూరంలోకి తమ కాన్వాయ్ రాగానే, కొన్ని అనుమానాస్పద వాహనాలు వెంబడించాయన్నారు. 
 
ఆపై కాన్పూర్ శివార్లలోకి వాహనం రాగానే, డ్రైవర్ వెనుక ఉన్న వికాస్ దూబే, తన పక్కనే ఉన్న కానిస్టేబుల్ నుంచి పిస్టల్‌ను లాక్కున్నాడు. డ్రైవర్‌తో పెనుగులాడగా, వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఆ వెంటనే వాహనాన్ని దిగిన దూబే, పోలీసులపైకి కాల్పులు జరుపుతూ పరిగెత్తాడు. 
 
వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని లొంగిపోవాలని హెచ్చరించినా వినలేదు. దీంతో ఆత్మరక్షణార్థం పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దూబేను ఆసుపత్రికి తరలించేలోపే అతను మరణించినట్టు ఆ అధికారి వివరించారు. 
 
ఇదే విషయాన్ని కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ కూడా స్పష్టం చేశారు. ఎన్‌కౌంటర్ జరిగిన ఘటనలో వికాస్ దూబే హతుడయ్యాడని తెలిపారు. కాగా తన కుమారుడు మరణించిన దగ్గర్నుంచి తండ్రి రామ్ కుమార్ దూబె శోకంలో మునిగి ఇవాళ గుండెపోటుతో మరణించారు.