శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

80 యేళ్లు దాటితో ఇంటి నుంచే ఓటు - కర్నాటకలో తొలిసారి అమలు

vote
ఇకపై ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటును కల్పించనున్నారు. 80 యేళ్లు పైబడిన వారికి ఈ అవకాశాన్ని కల్పించనున్నారు. ఈ సదుపాయాన్ని ఈ ఏడాది జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి అమలు చేయనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ప్రకటించారు. 
 
ఆయన శనివారం బెంగళూరులో మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రానికి రాలేని దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులు ఇంటి నుంచే ఓటు వేసేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. పోలింగ్‌కు ఐదు రోజులు ముందుగా వెలువరించే నోటిఫికేషన్‌ను అనుసరించి అర్హత ఉన్నవారు 'ఫార్మ్‌ 12డి' ద్వారా పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. గోప్యతను పాటిస్తూ వారందరికీ ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తామని ఆయన తెలిపారు.
 
80 ఏళ్లు పైబడినప్పటికీ పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడానికి ప్రయత్నించాలని, సాధ్యం కాని పక్షంలోనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని రాజీవ్‌ కుమార్‌ సూచించారు. ఈ ప్రక్రియను మొత్తం వీడియో తీస్తామని, వీఎఫ్‌హెచ్‌ సౌకర్యం కల్పించిన చోట అన్ని రాజకీయపార్టీలకు సమాచారమిస్తామని తెలిపారు. గతంలో వీఎఫ్‌హెచ్‌ విధానాన్ని పలు ఉప ఎన్నికల్లో పాటు గుజరాత్‌ ఎన్నికల్లోనూ ఎలక్షన్‌ కమిషన్‌ అమలు చేసింది.
 
తొలిసారి ఓటు వేసే ఓటర్లతో పాటు వృద్ధులు, యువత, దివ్యాంగులు తమ ఓటును సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు రాజీవ్‌ కుమార్‌ సూచించారు. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ముగియనున్న మే 24 లోపే ఎన్నికలను నిర్వహిస్తామని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన వెల్లడించారు. కర్ణాటకలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాజీవ్‌ కుమార్‌తో పాటు ఎన్నికల కమిషనర్లు అనూప్‌ చంద్రపాండే, అరుణ్‌ గోయల్‌లు మూడు రోజుల పాటు పర్యటించారు.