1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 జూన్ 2021 (08:19 IST)

మిస్టర్ ప్రైమ్ మినిస్టర్స్ : వీరేమైన బాండెడ్ లేబర్సా? మమత బెనర్జీ సూటి ప్రశ్న

ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంతో నేరుగా తలపడేందుకు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయించుకున్నారు. బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలపన్ బందోపాధ్యాయను రీకాల్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మమతా బెనర్జీ.. ఆయన్ను కేంద్ర సర్వీసులకు పంపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పైగా, బందోపాధ్యాయతో రాజీనామా చేయించి తన ప్రభుత్వానికి మూడేళ్ళ పాటు ముఖ్య సలహాదారుడుగా నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయంతో కేంద్రం షాక్‌కు గురైంది. 
 
కేంద్రం రీకాల్ చేయగా, అలపన్‌ను కేంద్రానికి డెప్యూట్ చేయబోనంటూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన కొద్ది సేపటికే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. బందోపాధ్యాయ రిటైర్ కాగానే మరో సీనియర్ అధికారి హెచ్.కె.ద్వివేదీ ఆయన స్థానే చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. 
 
బందోపాధ్యాయ విషయంలో కేంద్రం ఉత్తర్వులు తనకు షాక్ కలిగించాయని, ఈ కోవిడ్ మహమ్మారి సమయంలోనూ, యాస్ తుఫాను వల్ల తలెత్తిన నష్టాల తరుణంలోనూ ఆయన సేవలు ఈ రాష్ట్రానికి, ప్రభుత్వానికి, పేదలకు ఎంతో అవసరమని మమత పేర్కొన్నారు. 
 
ప్రజా సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసే ఓ అధికారికి అవమానం జరిగాక ఆ ప్రభుత్వం, (కేంద్రం), ప్రధాని ఏ సందేశం ఇవ్వదలచుకున్నారని ఆమె ప్రశ్నించారు.. వీరేమైనా బాండెడ్ లేబరర్సా? కేంద్రంలో ఎంతోమంది బెంగాలీ కేడర్ అధికారులున్నారు.. చర్చలు జరపకుండానే వారిని నేను రీకాల్ చేయగలుగుతానా? అని సూటిగా ప్రశ్నించారు. 
 
మమతా బెనర్జీ అంతటితో ఆగలేదు. "మిస్టర్ ప్రైమ్ మినిష్టర్.. బిజీ ప్రైమ్ మినిష్టర్.. మిస్టర్ మన్ కీ బాత్ ప్రైమ్ మినిష్టర్" అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విషయంలో మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయం రాజ్లకీయంగా పెను ప్రకంపనలు సృష్టించవచ్చునని భావిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీకి, బెంగాల్‌కు మధ్య అసలు సఖ్యత లేదు.