శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 28 మార్చి 2019 (08:56 IST)

భార్య ఓటమిని తట్టుకోలేక గెలిచిన అభ్యర్థి భర్తను చంపేశాడు...

ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఎన్నికల బరిలో ఉండేవారు పోటాపోటీగా ప్రచారం చేస్తారు. విమర్శలు సంధించుకుంటారు. చివరకు ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కలిసిపోతుంటారు. కానీ, మహారాష్ట్రలో మాత్రం ఎన్నికల్లో పోటీ చేసిన తన భార్య ఓటమిని ఓ భర్త తట్టుకోలేక పోయాడు. దీంతో గెలిచిన అభ్యర్థి భర్తను వాహనంతో ఢీకొట్టించి చంపేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, మహారాష్ట్ర పూణెకు చెందిన అవినాష్‌ కాంబ్లే, బాలాసాహెబ్‌ సోపాన్‌ వాన్షివ్‌లు దగ్గరి బంధువులు. వీరిద్దరి మధ్య కొన్ని నెలలుగా విభేదాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో స్థానిక పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నిక్లో కాంబ్లే, వాన్షివ్‌లు భార్యలు ప్రత్యర్థులుగా తలపడ్డారు. అయితే, గెలుపు మాత్రం వాన్షివ్ భార్యనే వరించింది. దీన్ని కాంబ్లే జీర్ణించుకోలేక పోయాడు. దీంతో వాన్షివ్‌ను హత్య చేయాలని ప్లాన్ చేశాడు. 
 
తన ప్రణాళికలో భాగంగా, వాన్షివ్‌ మార్నింగ్ వాక్‌కు వెళ్లడాన్ని కాంబ్లే గుర్తించారు. ఈనెల 13వ తేదీన కాంబ్లే కారులో తన సహచరులతో కలసి అక్కడికి చేరుకున్నాడు. ప్రమాదాన్ని వాన్షివ్‌ గమనించేలోపే అతడ్ని ముందు నుంచి కారుతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వాన్షివ్‌ను కొందరు గుర్తించి ఆస్పత్రిలో చేర్చించారు. కానీ, అక్కడ చికిత్స పొందుతూ ఆయన చనిపోయాడు. 
 
హతుడు వాన్షివ్‌ భార్య, తన భర్తది సహజ మరణం కాదని.. కావాలనే ఎవరో పక్కా ప్లాన్‌తో చంపారని పోలీసలకు ఫిర్యాదు చేసింది. పంచాయతీ ఎన్నికల్లో తన గెలుపును సహించని కొందరు కక్ష కట్టి ఈ దారుణానికి పాల్పడి ఉంటారని ఆమె  తన ఫిర్యాదులో తెలిపింది. దర్యాప్తు  ప్రారంభించిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీ  ఆధారాలతో వాన్షివ్‌ది హత్యగా తేల్చారు. కారుతో అతడిపై దాడికి తెగబడిన కొందరిలో ప్రధాన నిందితుడు కాంబ్లే కూడా సీసీటీవీతో దొరికిపోయాడు. దీంతో అతను, అతని అనుచరులపై హత్య కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.