1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 21 జూన్ 2023 (11:51 IST)

ప్రపంచంలో అతిపెద్ద ఆలయ నిర్మాణానికి భూమిపూజ... ఎక్కడ?

virata temple
బిహార్ రాష్ట్రంలోని తూర్పు చంపారణ్‌ జిల్లా, కల్యాణ్‌పుర్‌ బ్లాకు కైథవలియా గ్రామంలో ప్రపంచంలోనే అతిపెద్ద విరాట్‌ రామాయణ మందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం భూమిపూజ అనంతరం ఈ ఆలయ నిర్మాణపనులను ప్రారంభించారు. 2025 నాటికి ఆలయం పూర్తి చేసేలా ప్లాన్ చేశారు. 
 
పాట్న మహావీర్‌ మందిర్‌ న్యాస్‌ సమితి అధినేత ఆచార్య కిశోర్‌ కునాల్‌ నేతృత్వంలో మంగళవారం ఉదయం 11 గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహించి.. వెంటనే నిర్మాణపనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చి 'జై శ్రీరామ్‌' నినాదాలతో ఆ ప్రాంగణాన్ని హోరెత్తించారు. అయోధ్య రామమందిరం మాదిరిగానే విరాట్‌ రామాయణ ఆలయం సైతం భక్తులను ఆకట్టుకొంటుందని ఆచార్య కిశోర్‌ కునాల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
ఈ ఆలయాన్ని ఇన్‌ఫ్రా సన్‌టెక్‌   ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ నిర్మిస్తోంది. కంబోడియాలోని 12వ శతాబ్దం నాటి అంగ్‌కోర్‌ వాట్‌ ఆలయం ఎత్తు 215 అడుగులు కాగా.. విరాట్‌ రామాయణ ఆలయం 270 అడుగుల ఎత్తుతో 125 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు.
 
ఆలయ కాంప్లెక్సులో భాగంగా నిర్మించే శివాలయం ముందు 33 అడుగుల ఎత్తు, 33 అడుగుల వెడల్పుతో ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ఏర్పాటు చేయనున్నారు. గ్రానైట్‌తో మహాబలిపురంలో ఈ లింగం రూపుదిద్దుకుంటోంది. 1,008 శివలింగాలను ఒకే లింగంలో పేర్చి దీన్ని తయారు చేయనున్నారు. 
 
2012లోనే విరాట్‌ రామాయణ ఆలయ నిర్మాణం దిశగా అడుగులు పడ్డాయి. అయితే, ఆలయ నిర్మాణంపై కంబోడియా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రాజెక్టు ఆలస్యమైంది. అంగ్‌కోర్‌ వాట్‌ను పోలిన ఆలయాన్ని నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ కంబోడియా అడ్డు చెప్పింది. ఇరుదేశాల మధ్య చర్చలతో ఆలయ నిర్మాణానికి ఉన్న అడ్డంకి తొలగిపోయింది.