శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 జూన్ 2022 (12:30 IST)

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా భారత్ బంద్ - ఢిల్లీలో ట్రాఫిక్ జామ్

delhi traffic jam
త్రివిధ దళాల్లో సైనిక బలగాల నియామకం కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు సోమవారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో అనేక రాష్ట్రాల్లో ట్రాఫిక్ కష్టాలు ఉత్పన్నమయ్యాయి. ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా, దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. 
 
ముఖ్యంగా, ఈ భారత్ బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. అలాగే, దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.
 
భారత్‌ బంద్‌ నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు సోమవారం తనిఖీలు చేపట్టారు. దీంతో ఢిల్లీ - గురుగ్రామ్‌, ఢిల్లీ - నోయిడా హైవేలపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. తనిఖీల తర్వాతే వాహనాలను ఢిల్లీ లోపలకు అనుమతిస్తామని పోలీసులు స్పష్టంగా చెప్పడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
హైవేలపై వేలాది వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు, అగ్నిపథ్‌పై కాంగ్రెస్ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలోని పలు రహదారులను మూసివేశారు. దీంతో నగరంలోనూ పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.
 
అగ్నిపథ్ ఆందోళనల దృష్ట్యా పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. బీహార్‌లోని రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను పెంచారు. ఝార్ఖండ్‌లో ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లను మూసివేసి సెలవు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా స్టేషన్‌ వద్ద పోలీసు బలగాలు మోహరించాయి. నిరసనల నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాల్లో నడిచే అనేక రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది.