శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 10 జూన్ 2016 (21:27 IST)

డెట్రాయిట్ నగరంలో మారుమోగుతున్న తెలంగాణం...

ఫార్మింగ్టన్ హిల్స్: వరుస తెలంగాణ ఉత్సవాలతో డెట్రాయిట్ నగరం తెలంగాణా నగారా మోగిస్తున్నది. రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 5న డెట్రాయిట్ తెలంగాణ కమ్యూనిటీ, తెలంగాణ జాగృతి ఎన్నారై విభాగం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో, చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ కలిసి రాష్ట్రం పుట్టినరోజుని సొంత పుట్టినరోజులా జరుపుకున్నారు. పిల్లలూ, తెలంగాణ ఆడపడుచులు మన ఆటపాటల్లో మమేకమై తెలంగాణ మీద అభిమానాన్ని, ప్రేమను చాటుకున్నారు.
 
ప్రొఫెసర్ జయశంకర్ గారికి నివాళి అర్పించి అందరూ ఆయన ఆదర్శాలను స్మరించుకున్నారు. త్యాగధనుల పోరాటాలను, అమరవీరుల త్యాగాలను తలుచుకున్నప్పుడు అందరి గుండెలు బరువెక్కాయి. తెలంగాణ ఆత్మగౌరవ పటంపై సంస్కృతి బావుటాలను ఎగురవేసే సంఘటిత కార్యక్రమాల్లో ఏకమై కలిసికట్టుగా తెలంగాణతనాన్ని నిలబెడుదామని తీర్మానించుకున్నారు.
 
పచ్చిపులుసు, పెసర పప్పు, కోడికూర, కోడి పులావ్, గుడాలు వంటి ఎన్నో తెలుగు వంటకాలను ఆహ్వానితులకు రుచి చూపించారు. " జయ జయహే తెలంగాణ" అంటూ మొదలుపెట్టి కార్యక్రమాద్యంతం తమ గాన మాధుర్యంతో శ్రోతలను ముగ్దుల్ని చేసి కట్టిపడెయ్యడమే కాకుండా, స్వచ్చమైన తెలంగాణ జానపదాలతో అందరినీ ఉత్సాహంతో నింపి చిందేయించారు సాయి బ్రదర్స్. మైకు పట్టుకున్నది మొదలు కార్యక్రమం చివరి దాకా అందరినీ భాగస్వాములను చేసి అందరితో ఆడించి, పాడించి ఒంటి చేత్తో సంబరాలు ఉత్సవం జరిపాడు నాయక్. డెట్రాయిట్ తెలంగాణ అసోసియేషన్ ఆహ్వానం మన్నించి కెనడా నుంచి వచ్చి మమ్మల్నందరినీ అలరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అధ్యక్షుడు భుజంగరావు గారు. పిలవగానే వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు చైర్మన్ రాంగోపాల్ గారు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. మురళి బొమ్మనవేని, జాగృతి కార్యక్రమాలను వివరించారు. ఇతర తెలుగు సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు.
 
డీటీసి బోర్డ్ మెంబర్లు, ట్రస్టీలు ఎన్నో వ్యయప్రయాసను అధిగమించి తెలంగాణతనాన్ని చాటడమే ధ్యేయంగా ఇలాంటి కార్యక్రమాలను ఏటా నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని ఆహ్వానితులు అందరూ చెప్పడం జరిగింది.
 
ఈ కార్యక్రమ నిర్వహణకు తోడ్పడిన డీటిసి బోర్డు సభ్యులు శైలేంద్ర సనమ్, మురళి, బొమ్మనవేని, నాగేంద్ర ఆయిత, శ్రీధర్ బండారు, రాజు బ్రహ్మానందబేరి, విజయ్ భాస్కర్ పల్లెర్ల, రాజ్ మాడిశెట్టి, కృష్ణ గుడుగుంట్ల, సునీల్ మర్రి, హరి పరాంకుశం, హరి మారోజు, భరత్ మాదాడి, శ్రీనివాస్ రాజు, సూర్య మానేపల్లి, శశి ఎల్లందుల, శ్రీనివాసరావు గాలి ఇంకా వాలంటీర్లు శరత్ వెల్దండ, నరేన్ తిరు, చైతన్య, రవి చిలుక, జితేందర్ సుంకె, రాజశేఖర్ కౌకుంట్ల, సతీష్ పింగళి, మోహన్ రెడ్డి, దివాకర్, సంతోష్ రావు తదితరులందరికీ భుజంగరావు గారు కృతజ్ఞతలు తెలిపారు.