శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 16 జులై 2020 (22:19 IST)

శ్రావణమాసం రాబోతోంది, లక్ష్మీదేవిని అలా ఆరాధిస్తే...?

లక్ష్మీదేవిని శ్రావణమాసంలో వ్రతాలు ఆచరిస్తూ కొలుస్తుంటారు మహిళలు. ఈ మాసాన్ని వరాలు అందించే మాసంగా భక్తులు భావిస్తుంటారు. సౌభాగ్యాన్ని ప్రసాదించే పార్వతీదేవి, సంపదలను ప్రసాదించే లక్ష్మీదేవి భక్తులను అనుగ్రహించడం ఈ శ్రావణ మాసం ప్రత్యేకంగా కనిపిస్తుంది.
 
శ్రావణం మంగళవారాల్లో పార్వతీదేవిని, శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ఆరాధిస్తూ పూజలు, వ్రతాలు చేస్తుంటారు. పూజామందిరాల్లో పార్వతి, లక్ష్మీదేవికి భక్తిశ్రద్ధలతో ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తుంటారు. శుక్రవారం లక్ష్మీదేవి ఆలయానికి వెళ్లే మహిళా భక్తులు ఆ తల్లికి పండ్లతో పాటు తామర పువ్వులు లేదా గులాబీ పువ్వులను తీసుకుని వెళుతుంటారు.
 
పరమాన్నం పార్వతిదేవికి ఇష్టమైనదిగా శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి బెల్లం, ఆవుపాలు, కొసలు విరగని బియ్యంతో పరమాన్నం తయారు చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. పరమ పవిత్రమైన ఈ రోజున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తే విశేషమైన ఫలితాలను పొందవచ్చును. శ్రావణం మాసపు శుక్రవారాల్లో ఒక్కపూట మాత్రమే భోజనం చేసి, పగలు నిద్రపోకుండా, ఆ రోజంతా లక్ష్మీదేవిని ధ్యానిస్తూ కనకధారాస్తవం, లక్ష్మీదేవ అష్టోత్తరం, లక్ష్మీదేవి సహస్రనామాలు చదువుకోవడం వలన ఆ తల్లి సకల సంపదలను, సంతోషాన్ని ప్రసాదిస్తుందని చెప్పబడింది.