1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : సోమవారం, 13 జూన్ 2016 (15:01 IST)

శ్రీనివాసునికి సాటి రాగల దేవుడు లేడు.. ఇక రాడు..!

బ్రహ్మాండాలలో వేంకటాచల క్షేత్రానికి సమానమైన పుణ్యస్థలం లేనేలేదని, అలాగే ఆ దివ్యక్షేత్రంపై వెలసి ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామికి సాటి రాగల దేవుడు ఇటు భూతకాలంలోను, అటు భవిష్యత్తులోను లేడని, ఇక ఉండబోడని పురాణాలు చెబుతున్నాయి. 
 
శ్రీనివాసుడు ఐదు వేల యేళ్ల ముందు తిరుమలకు సాక్షాత్కరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అలాగే పూర్వం శ్రీ మన్నారాయణుడు శ్వేత వరాహరూపంతో అవతరించి క్రూర రాక్షసుడైన హిరణ్యాక్షుణ్ణి సంహరించి తన కోర్కెలతో భూమండలాన్ని ఉద్ధరించాడు. తనను రక్షించినందువల్ల భూదేవి వరాహస్వామినిపతిగా వరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆమెతో కలిసి తిరుమల ఆలయానికి కుడివైపున భూవరాహస్వామిగా స్థిరపడ్డాడు. ఆ నాటి నుంచి ఈ దివ్యస్థలం ఆది వరాహక్షేత్రం అని, భూవరాహక్షేత్రం అని ప్రసిద్ధమైన పేర్లతో పిలుస్తుంటారు. 
 
ఆ తర్వాత కొంతకాలానికి శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం భక్తుల కోసం వైకుంఠాన్ని విడిచిపెట్టి తిరుమల క్షేత్రంలో వేంకటేశ్వరుడు అనే పేరుతో నిలిచాడు. వేంకటేశ్వరస్వామికి తొండమాన్‌ చక్రవర్తి నిర్మించిన ఆనంద నిలయంలో ప్రవేశించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పద కవితా పితామహుడు అన్నమయ్య చెప్పినట్లుగా భక్తవత్సలుడైన శ్రీ స్వామివారి సేవలో తొండమాన్‌ చక్రవర్తి, కుమ్మరనంబి వంటి భక్తులు ఎంతో మంది తరించారు.
 
పురాణాల్లో ఇప్పటికీ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ప్రధానంగా కలియుగ వైకుంఠున్ని మించిన దైవం అసలు ఉండరనేది ఇక్కడి మొదటిది. అందుకే అంతటి ప్రాముఖ్యత కలిగిన శ్రీనివాసున్ని లక్షలాదిమంది భక్తులు ఇప్పటికీ దర్శించుకుని తరిస్తూనే ఉన్నారు. 
 
"వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన...
వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి..."