గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్

శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు... నేటి నుంచి ప్రారంభం

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు బుధవారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభంకానున్నాయి. కొవిడ్‌ నిబంధనల మధ్య ఉత్సవాలను రాత్రి ప్రారంభించనున్నారు. ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో విహరించనున్నారు. 
 
ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశితో తెప్పోత్సవాలు మొదలై పౌర్ణమి వరకు జరుగుతాయి. ఇందుకోసం ఇంజినీరింగ్‌ అధికారులు తెప్పను విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పుష్కరిణిని అందంగా అలంకరించారు. తెప్ప చుట్టూ నీటి జల్లులు (షవర్‌) పడేలా ఏర్పాట్లు చేశారు. 
 
తెప్పోత్సవాల్లో అలంకరణ కోసం రోజుకు 500 కిలోల పుష్పాలను వినియోగించనున్నారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు మ‌ల్లెపూల మాల‌లు అలంకరించనున్నారు. సంవత్సరంలో తెప్పోత్సవాల నుంచే మ‌ల్లెపూల‌ను స్వామివారి సేవ‌ల‌కు వినియోగించ‌డం మొద‌ల‌వుతుంది.
 
ఈ ఉత్సవాల సందర్భంగా నిఘా, భద్రతా సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేప‌ట్టారు. గ‌జ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. తొలిరోజు సాయంత్రం సీతారామలక్ష్మణ ఆంజనేయ సమేత రామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు మాడ‌వీధుల ప్రదక్షిణంగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు విహరిస్తారు. 
 
ఇక శ్రీదేవి, భూదేవి స‌మేత మలయప్పస్వామివారు తెప్పపై మూడో రోజు మూడు చుట్లు, నాలుగో రోజు ఐదు చుట్లు, ఐదో రోజు ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షించనున్నారు. తెప్పోత్సవాల నేపథ్యంలో 24, 25వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ (వ‌ర్చువ‌ల్‌‌), మార్చి 26, 27, 28వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ ‌(వ‌ర్చువ‌ల్)లను టీటీడీ రద్దు చేసింది. భ‌క్తులు ఈ విష‌యాన్నిగమనించాలని కోరింది.