1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Chakratirtha mukkoti performed in Tirumala

తిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి..!

Chakratirtha mukkoti
తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి ఘనంగా జరిగింది. ప్రతి యేడాది కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు, భక్తులు ఉదయం మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుంచి ఊరేగింపుగా చక్రతీర్థానికి చేరుకున్నారు.

 
అక్కడి నుంచి శ్రీ చక్రత్తాళ్వారుకు, నరసింహస్వామివారికి, ఆంజనేయ స్వామివారికి అభిషేకం, పుష్పాలంకారం, హారతి చేపట్టారు. హారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.

 
స్కంద పురాణం ప్రకారం పద్మనాభ మహర్షి అనే యోగి చక్రతీర్థంలో 12 సంవత్సరాల తపస్సు చేశాడు. అందుకు సంతసించి శంఖు, చక్ర, గదాభూషితుడైన శ్రీ మహావిష్ణువు అతనికి ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజలు చేయాలని చెప్పి అంతర్థానమయ్యాడు. 

 
పద్మనాభ మహర్షి స్వామి ఆజ్ఞానుసారం చక్రతీర్థంలో తపస్సు చేశాడు. అయితే ఒకనాడు ఓ రాక్షసుడు అతనిని భక్షించడానికి రాగా మహర్షి తిరిగి స్వామివారిని ప్రార్థించాడు. అప్పుడు స్వామి తన చక్రాయుధాన్ని పంపించి ఆ రాక్షసుడిని సంహరించాడు. అటు తరువాత ఆ మహర్షి శ్రీ సుదర్సన చక్రాన్ని ఆ ప్రాంతంలో ఉంచి భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా స్వామివారిని కోరాడు.

 
భక్తవల్లభుడైన స్వామివారు తన సుదర్సన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండేలా ఆజ్ఞాపించడంతో ఈ తీర్థం చక్రతీర్థంగా ప్రసిద్ధిగాంచింది. వరాహ పురాణ నేపథ్యంలో తిరుమలలోని శేషగిరులలో వెలసి ఉన్న 66 కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైనవిగా చెప్పబడే సప్త తీర్థాలలో చక్ర తీర్థం ప్రముఖ తీర్థంగా పురాణాలు చెబుతున్నాయి.
About Writer
జె
తర్వాతి కథనం
పెళ్లీడు అమ్మాయిలు ధనుర్మాసంలో విష్ణువును పూజిస్తే...