శ్రీవారికి చెన్నై భక్తుల భూరి విరాళం - ఒక్క రోజు విరాళాల్లో ఇదే అత్యధికం
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు భారీ విరాళాన్ని అందించారు. తమిళనాడుకు చెందిన పలువురు భక్తులు శ్రీవారికి రూ.10 కోట్లు విరాళంగా అందజేశారు. స్వామివారికి ఇలా ఒక్క రోజే భారీ స్థాయిలో విరాళం అందించడం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఈ విరాళాలు ఇచ్చిన వారిలో తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన భక్తుడు గోపాల బాలకృష్ణన్ తితిదే నిర్వహణలో ఉన్న అన్నదానం సహా 7 ట్రస్టులకు రూ.7 కోట్లు విరాళంగా అందించారు. ఏ స్టార్ టెస్టింగ్ అండ్ ఇన్స్పెక్షన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ రూ.కోటి విరాళంగా ఇచ్చారు.
అలాగే, బాలకృష్ణ ఫ్యూయల్ స్టేషన్ సంస్థ శ్రీవాణి ట్రస్టుకు రూ.కోటి, ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు సీహబ్ ఇన్స్పెక్షన్ సర్వీసెస్ సంస్థ రూ.కోటి విరాళంగా అందించారు. తిరుమలలోని తితిదే ఈఓ కార్యాలయంలో తితిదే ఈఓ ధర్మారెడ్డికి దాతలు విరాళానికి సంబంధించిన చెక్కులు అందజేశారు.
