ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 24 మే 2018 (12:58 IST)

ఘనపురం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి మహిమ-ఏలినాటి శని గ్రహ ప్రభావం తొలగిపోవాలంటే?

శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని పౌర్ణమి రోజున స్తుతించే వారికి పదవోన్నతి లభిస్తుందని పురోహితులు తెలిపారు. పౌర్ణమి, ప్రదోషకాలంలో లక్ష్మీనరసింహ స్వామిని ప్రార్థించే భక్తులకు బాధలు, ఏలినాటి శనిగ్రహ ప్రభావం త

శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని పౌర్ణమి రోజున స్తుతించే వారికి పదవోన్నతి లభిస్తుందని పురోహితులు తెలిపారు. పౌర్ణమి, ప్రదోషకాలంలో లక్ష్మీనరసింహ స్వామిని ప్రార్థించే భక్తులకు బాధలు, ఏలినాటి శనిగ్రహ ప్రభావం తొలగిపొతుంది. ఇంకా శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి ప్రదోషం, పౌర్ణమి, స్వాతి నక్షత్ర సమయంలో కొబ్బరినీరు, పాలు, పన్నీరు, తేనె, పసుపు, చందనం, తిరుమంజనపొడి వంటి అభిషేక వస్తువులతో అభిషేకం చేయిస్తే సకల సంపదలు చేకూరుతాయి.
 
అభిషేకం పూర్తయిన తరువాత తులసీమాలను అర్పించి స్తుతించే వారికి సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి. లక్ష్మీనరసింహ స్వామిని పై తిథుల్లో ఆరాంధించే వారికి తీరని రుణబాధలు, మానసికాందోళనలు తొలగిపోతాయి. పదవోన్నతి, విదేశీయానం చేకూరుతుంది. 
 
మాఘశుద్ధ పౌర్ణమి రోజున కొన్ని క్షేత్రాల్లో నరసింహస్వామి కల్యాణోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతూఉంటాయి. ఈ సందర్భంగా నరసింహస్వామి ఆవిర్భవించిన ఆయా క్షేత్రాలు భక్తజన సందడిగా కనిపిస్తుంటుంది. అలా కల్యాణోత్సవ శోభను సంతరించుకునే క్షేత్రాల్లో ఘనపురం ఒకటిగా కనిపిస్తూ ఉంటుంది.
 
నరసింహస్వామి స్వయంభువుగా ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాల్లో ఘనపురం ఒకటిగా ప్రసిద్ధిచెందింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ నరసింహస్వామి లక్ష్మీసమేతంగా వెలుగుచూశాడు. అప్పటి నుంచి ఆ స్వామి చూపుతోన్న మహిమలు అన్నీఇన్నీ కావు. ప్రతి సంవత్సరం ఇక్కడి స్వామివారికి మాఘమాసంలో అయిదు రోజులపాటు కల్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది. 
 
ఈ నేపథ్యంలో మాఘశుద్ధ పౌర్ణమి రోజున స్వామివారికి వైభవంగా రథోత్సవం జరుపుతారు. రథంపై ఊరేగుతూ వస్తోన్న స్వామివారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ క్షేత్రం మహిమాన్వితమైనదనీ, స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని భక్తులు బలంగా విశ్వసిస్తుంటారు. అందువలన అత్యంత భక్తిశ్రద్ధలతో ఆయన ఉత్సవాల్లో పాల్గొంటూఉంటారు.
 
రథంపై ఊరేగుతోన్న స్వామివారినీ దర్శించుకోవడం వలన జన్మజన్మల పాపాలు నశిస్తాయని భావిస్తుంటారు. ఆ సమయంలో స్వామివారికి చెప్పుకున్న కోరికలు అనతికాలంలోనే నెరవేరతాయని అంటారు. దారిద్ర్యము దుఃఖం నశించి సకలసంపదలు కలుగుతాయనీ, శుభాలు చేకూరతాయని చెబుతుంటారు.