నేడు శ్రీవారికి పున్నమి గరుడ సేవ... సాగర సంగమంలో పుణ్యస్నానాలు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి పున్నమి గరుడుసేవ సోమవారం అత్యంత వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా ఉత్సవాన్ని నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. దీంతో సోమవారం సాయంత్రం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు గరుడసేవను నిర్వహించడానికి తితిదే సన్నాహాలు చేసింది.
ఇకపోతే తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి దర్శనానికి మూడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట, కాలినడకన వచ్చిన భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. ఆదివారం వేంకటనాథుడిని 81,477మంది దర్శించుకున్నట్టు తితిదే అధికారులు వెల్లడించారు.
ఇదిలావుండగా, మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా కృష్ణాజిల్లా కోడూరు మండలంలోని పవిత్ర కృష్ణా సాగర సంగమమైన హంసలదీవిలో మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్లు కుటుంబ సమేతంగా సోమవారం పుణ్యస్నానాలు ఆచరించారు. పవిత్రస్థలమైన సాగర సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని రఘునాథ రెడ్డి అన్నారు.
