కామన్వెల్త్ క్రీడా పోటీలు : భారత్ పతకాల మోత
గ్లాస్కో వేదికగా కామన్వెల్త్ క్రీడా పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భారత్ క్రీడాకారులు పతకాల మోత మోగిస్తున్నారు. ముఖ్యంగా బాక్సింగ్ భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో ఏకంగా ఏడు స్వర్ణాలు, మూడు రజతాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు. మరోవైపు, అథ్లెటిక్స్ గుల్వీర్ సింగ్ అరుదైన ఘనతను అందుకున్నాడు.
శనివారం జరిగిన ఫైనల్స్ అంకుశ్ పంఘాల్ (80 కేజీలు), సచిన్ సివాచ్ (60 కేజీలు) సహా అరుంధతి, ప్రియ, సాక్షి, ప్రీతి, జైస్మిన్ స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ బాక్సింగ్లో భారత్ తన అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది.
మహిళల 75 కేజీల విభాగం ఫైనల్లో ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బొర్గోహెయిన్.. ఆస్ట్రేలియా బాక్సర్ ఎమ్మా- స్యూ గ్రీన్ చేతిలో 1-4 తేడాతో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకుంది. అయినప్పటికీ, ఈ పతకంతో మేజర్ టోర్నమెంట్లన్నింటిలో పతకం సాధించిన మేరీ కోమ్, విజేందర్ సింగ్ సరసన లవ్లీనా చోటు దక్కించుకుంది. నరేందర్ (90+ కేజీలు), జడుమణి సింగ్ కూడా రజతాలు సాధించారు.
అథ్లెటిక్స్లో భారత స్టార్ రన్నర్ గుల్వీర్ సింగ్ చారిత్రక ప్రదర్శన చేశాడు. పురుషుల 5000 మీటర్ల పరుగులో 13:24.95 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరి కాంస్యం గెలుచుకున్నాడు. అంతకుముందు 10,000 మీటర్లలో రజతం సాధించిన గుల్వీర్, ఒకే కామన్వెల్త్ గేమ్స్లో ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.
