1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (09:21 IST)

ప్రజాభవన్ వద్ద ఆటోకు నిప్పు పెట్టిన డ్రైవర్.. ఎందుకో తెలుసా?

auto fire
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ప్రజాభవన్ వద్ద ఓ డ్రైవర్ తనకు ఉపాధిని కల్పించే ఆటోకు నిప్పు పెట్టాడు. తెలంగాణంలో ఇటీవల ఏర్పడిన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. దీంతో ఆటోలలో ఎక్కే ప్రయాణికులే కరువయ్యారు. ఫలితంగా అనేక మంది ఆటో డ్రైవర్లు ఉపాధిని కోల్పోయి రోడ్డునపడ్డారు. పలుచోట్ల ఆటో డ్రైవర్లు ఆందోళన కూడా చేశారు. ఈ క్రమంలో గిరాకీ లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ ఆటో డ్రైవర్ మద్యం మత్తులో తన ఆటోకు ప్రజాభవన్ ఎదురుగా నిప్పు పెట్టాడు. పంజాగుట్ట పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... 
 
పాలమూరు జిల్లాకు చెందిన దేవ్ల అనే వ్యక్తిని భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ వచ్చి మియాపూర్‌లో ఉంటూ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల ఆటోకు కిరాయి సరిగా లేకపోవడంతో కుటుంబ పోషణ కోసం ఇక్కడా.. ఇక్కడా అప్పులు చేశాడు. దీంతో ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకునిపోయాడు. 
 
ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఆటోలో ప్రజాభవన్ వద్దకు వచ్చి సరిగ్గా 7 గంటల సమయంలో ఆటోపై పెట్రోల్ చల్లి నిప్పు అంటించాడు. దీంతో ఆటో మంటల్లో కాలిపోయింది. ఈ క్రమంలో ఆటుకు సమీపానికి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించగా, అక్కడే ఉన్న పోలీసులు దేవ్లను పట్టుకుని వారించారు. గిరాకీ లేక పూటగడవడమే కష్టంగా ఉందని దేవ్ల వాపోయాడు. దీనిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.