బుధవారం, 16 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 ఏప్రియల్ 2025 (12:54 IST)

వృద్ధుడికి పునర్జన్మనిచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు!!

dr preethi reddy
ఇటీవలికాలంలో గుండెపోటుకుగురయ్యే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఆటలు ఆడుతూనో, వ్యాయామం చేస్తూనో, జాగింగ్ చేస్తూనో, జర్నీలో ఉన్న సమయాల్లో గుండెపోటుకు గురవుతుంటారు. ఇలాంటి వారికి గోల్డెన్ అవర్‌గా భావించే సమయంలో సీపీఆర్ చేస్తే ప్రాణాలు రక్షించే అవకాశం ఉంది. తాజాగా విమానంలో గుండెపోటుకు గురైన ఓ వృద్ధుడుకి తెలంగాణ రాష్ట్రానికి చెంది మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు సీపీఆర్ చేసి పునర్జన్మను ప్రసాదించింది. శనివారం రాత్రి ఇండిగో విమానంలో జరిగిన ఈ సంఘటనలో మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ వృద్ధుడు ప్రాణాలను రక్షించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, శనివారం అర్థరాత్రి ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో 74 యేళ్ళ వయసున్న ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆయన అపస్మారక స్థితిలోకి జారుకోవడంతోపాటు నోటి నుంచి ద్రవం బయటకు రావడం ప్రారంభమైంది. దీంతో తోటి ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. 
 
ఆ సమయంలో అదే విమానంలో ప్రయాణిస్తున్న డాక్టర్ ప్రీతి రెడ్డి.. ఈ పరిస్థితిని గమనించి తక్షణమే స్పందించారు. వృత్తిరీత్యా వైద్యురాలైన ఆమె.. ఆ వృద్ధుడికి ప్రాథమికంగా పరీక్షించారు. ఆయన రక్తపోటు బాగా తగ్గిపోవడంతో పాటు ఆయన పరిస్థితి విషమంగా ఉందని గ్రహించి, సీపీఆర్ ప్రక్రియను ప్రారంభించారు. కొంతసమయం పాటు ఆమె చేసిన ప్రయత్నం ఫలించి, ఆ వృద్ధుడు పరిస్థితి మెరగుపడింది. ఆ తర్వాత విమానం ల్యాండ్ కాగానే హుటాహుటిన వృద్ధుడుని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.