ప్రధాని మోడీ రూ.కోట్లు ఇస్తున్నారు.. అభివృద్ధిలో ఏపీ దూసుకెళుతోంది : మాజీ మంత్రి మల్లారెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోట్లాది రూపాయలను ఇస్తున్నారని, దీంతో ఏపీ అభివృద్ధిలో దూసుకునిపోతోందని తెలంగాణ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆయన మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, నా పుట్టిన రోజు నాడు ఏటా స్వామి వారి దర్శనానికి వస్తుంటా. గత యేడాది యూనివర్శిటీలు కావాలని కోరుకున్నా. ఇపుడు దేశంలోనే 3 పెద్ద డీమ్డ్ వర్శిటీలు నడిస్తున్నా. తెలంగాణాలో భారాత రాష్ట్ర సమితి హయాంలో పదేళ్లలో దేశంలో ఎక్కడా లేని అభివృద్ధిని కేసీఆర్ చేశారు.
హైదరాబాద్ నగరానికి మల్టీ నేషనల్ కంపెనీలను కేసీఆర్ తీసుకొచ్చారు. తెలంగాణాలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. గతంలో ఏపీలో ఆస్తులు అమ్ముకుని హైదరాబాద్ నగరానికి వచ్చేవారు. ఇపుడు పరిస్థితి తారుమారైంది. తెలంగాణ వాళ్లు ఏపీలో ఆస్తులు కొని వ్యాపారాలు చేస్తున్నారు. పరిస్థితి మళ్లీ మారాలంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలి. అపుడే పాత రోజులు వస్తాయి అని మల్లారెడ్డి అన్నారు.
ఇకపోతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాగా అభివృద్ది చేస్తున్నారని అన్నారు. ఏపీకి ప్రధాని మోడీ రూ.లక్షల కోట్లు కేటాయిస్తున్నారని చెప్పారు. అభివృద్ధిని చంద్రబాబు పరుగులు తీయిస్తున్నారన్నారు.