మంగళవారం, 25 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 సెప్టెంబరు 2025 (18:25 IST)

బ్లడ్ చంద్రగ్రహణం : తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

ttd temple close
బ్లడ్ చంద్రగ్రహణ ప్రభావం కారణంగా ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు 27,525 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. అర్థరాత్రి 12 తర్వాత నిర్వహించే ఏకాంత సేవను మధ్యాహ్నం 3 గంటలకే పూర్తి చేశారు.
 
భూవరాహస్వామి ఆలయంతో పాటు, అన్న ప్రసాద వితరణ కేంద్రాలను సైతం మూసివేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా 50 వేల పులిహోర, బిస్కెట్‌ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచి శుద్ధి చేశాక 3 గంటలకు సుప్రభాతంతో దర్శనాలు ప్రారంభిస్తామని, అప్పటి నుంచే సర్వదర్శనం క్యూలైన్‌లోకి భక్తులను అనుమతిస్తామని తితిదే అధికారులు తెలిపారు.
 
చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం మల్లన్న, ఒంటిమిట్ట కోదండరామస్వామి, భద్రాచలం సీతారామచంద్రస్వామి, సింహాచలం అప్పన్న, బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయం సహా తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలన్ని మూసివేశారు.