Hyderabad: పని ఒత్తిడి తట్టుకోలేక చార్టర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్య
పని ఒత్తిడి తట్టుకోలేక ఓ చార్టర్డ్ అకౌంటెంట్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ విషాదం వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లో సురేశ్ రెడ్డి (28) అనే యువకుడు ఓ కంపెనీలో సీఏగా పనిచేస్తున్నాడు. అతని సోదరుడితో కలిసి మణికొండలో ఉంటున్నాడు.
అయితే జూన్ 16న సురేశ్ రెడ్డి తన సోదరి ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొండాపూర్లోని రాజరాజేశ్వరీ కాలనీలో ఉన్న సర్వీస్ అపార్ట్మెంట్లో అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పని ఒత్తిడి తాళలేక సురేశ్ రెడ్డి హీలియం గ్యాస్ పీల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పని ఒత్తిడి తాళలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానని రాసి పెట్టిన సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇక మృతుడి స్వస్థలం కామారెడ్డి జిల్లా పాల్వంచగా గుర్తించారు.