నటి రమ్యశ్రీపై దాడి... పోలీసులకు ఫిర్యాదు.. దాడిచేసింది ఎవరంటే...
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో సినీ నటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు ప్రశాంత్పై దాడి జరిగింది. ఈ దాడిపై ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసున మోదు చేసి విచారణ జరుపుతున్నారు. గచ్చిబౌలి ప్రధాన రహదారిని ఆనుకుని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లే ఔట్లో సంధ్యా కన్వెన్షన్ ఆక్రమణలను నెల రోజుల క్రితం హైడ్రా తొలగించింది. అనుమతి లేకుండా నిర్మించిన మినీ హాల్, పలు గదులు, 2 షెడ్లను నేలమట్టం చేసింది.
సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు ఎఫ్సీఐ లేఔట్లో ఉన్న రహదారులు, పార్కులను కూడా ఆనవాళ్లు లేకుండా చేశారని, వాటిని పునరుద్ధరించాలని ఫ్లాట్ యజమానులు హైడ్రా కమిషన్ రంగనాథ్కు విన్నవించారు. దీంతో మంగళవారం శేరిలింగంపల్లి టౌన్ ప్లానిగ్ అధికారులు లే ఔట్లలో రహదారుల గుర్తింపు పనులకు శ్రీకారం చుట్టారు.
ఫ్లాట్ యజమానుల్లో ఒకరైన సినీ నటి రమ్యశ్రీ తన సోదరుడు ప్రశాంత్తో కలిసి అక్కడకు వచ్చారు. మధ్యాహ్నం భోజనానికి వెళుతున్న రమ్యశ్రీ, ప్రశాంత్ను శ్రీధర్ రావు అనుచరులు అడ్డుకున్నారు. వీడియోలు ఎందుకు తీశారంటూ ఫోన్ లాక్కొని దాడికి యత్నించగా, ప్రశాంత్ అడ్డుకున్నాడు. దీంతో అతనిపై దాడి చేశారు. తమపై దాడి చేసిన శ్రీధర్ రావు అనుచరుడు వెంకటేశ్పై చర్యలు తీసుకోవాలని రమ్యశ్రీ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోలీసుల బందోబస్తు మధ్య అధికారులు మార్కింగ్ పూర్తిచేశారు.