Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప
ప్రభుత్వ కార్యాలయాల్లోని అవినీతికి ఈ ఘటన అద్దం పడుతోంది. జీహెచ్ఎంసీలోని కాప్రా సర్కిల్లో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్ స్వరూప.. రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని కాప్రా సర్కిల్, చర్లపల్లి డివిజన్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ స్వరూప లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. నగరానికి చెందిన ఒక కాంట్రాక్టర్, తాను చేసిన పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించాలని ఏఈ స్వరూపను పలుమార్లు ఆశ్రయించారు.
అయితే.. కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించడానికి బదులుగా.. ఏఈ స్వరూప రూ.1.20 లక్షలు లంచంగా ఇవ్వాలని తీవ్రంగా ఒత్తిడి చేసింది. అయితే ఆ కాంట్రాక్టర్ ఏసీబీకి ఫిర్యాదు చేసాడు.
ఏసీబీ అధికారుల పర్యవేక్షణలో.. బాధితుడైన కాంట్రాక్టర్ నుంచి ఏఈ స్వరూప రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ బృందం ఆమెను తక్షణమే పట్టుకుంది. లంచంగా తీసుకున్న నగదును స్వాధీనం చేసుకుని.. ఏఈ స్వరూపను అదుపులోకి తీసుకుని లోతుగా విచారణ చేస్తున్నారు.