Hyderabad: బ్రాస్లెట్ కోసం గొడవ: చెంపదెబ్బ భార్య చనిపోయిందని భర్త ఆత్మహత్య.. చివరికి?
చిన్న చిన్న విషయాలకే తగాదాలు పడటం, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడటం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. చిన్న విషయాలకు కూడా సర్దుకుపోకుండా వాగ్వివాదాలకు దిగడంతో కొన్నిసార్లు వారి జీవితంలో విషాదం నెలకొంటుంది. తాజాగా తాను కొట్టడంతో భార్య చనిపోయిందనే భయంతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆదివారం రాజేంద్రనగర్లోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకు చెందిన కుమారస్వామి, మౌనిక అనే జంట వివాహం చేసుకుని ఒక సంవత్సరం అయింది. వివాహం తర్వాత, వారు బండ్లగూడ జాగీర్లోని భవానీ కాలనీలో నివసిస్తున్నారు. ఇటీవల, బంగారు బ్రాస్లెట్ పోయిందని దంపతుల మధ్య గొడవ జరిగింది.
కూర్మరస్వామి కోపంగా మౌనికను చెంపదెబ్బ కొట్టాడు. ఆ తర్వాత ఆమె స్పృహ తప్పి పడిపోయింది. తన భార్య తన దాడి వల్లే చనిపోయిందని భావించి, ఆపై జరిగే పరిణామాలకు భయపడి కుమారస్వామి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పొరుగింటివారి సమాచారం మేరకు రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష కోసం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో భార్య తర్వాత స్పృహలోకి వచ్చిందని, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు నిర్ధారించారు.