1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 5 జులై 2019 (10:58 IST)

ఖరీదైన బెంజ్ కారులో వచ్చి గన్‌తో కాల్చుకు చనిపోయాడు?

హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్డు మీద ఓ వ్యక్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బెంజ్ కారులో ఉన్న సదరు వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నార్సింగి వద్ద ఉన్న ఔటర్ రింగు రోడ్డు మీద ఈ ఘటన జరిగింది. TS 09 UB 6040 నెంబరు గల రెడ్ కలర్ బెంజ్ కారులో వచ్చిన వ్యక్తి రోడ్డుమీద కారు ఆపి తుపాకీతో కాల్చుకున్నాడన్నది ప్రాధమిక సమాచారం. 
 
బాధితుడును ఫైజాన్ అహ్మద్‌గా గుర్తించారు పోలీసులు. ఇతను కొంతకాలంగా యూఎస్ కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నాడు. అయితే అతడి ఆత్మహత్యకు కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. ఫైజాన్ అహ్మద్ లోయర్ ట్యాంక్ బండ్‌ సమీపంలో ఉన్న వాయు విహార్‌లో నివసిస్తున్నట్టు తెలిసింది. 
 
ఫోర్ వీల్స్ అనే కంపెనీని నుంచి బెంజ్ కారును అద్దెకు తీసుకుని కారులో ఔటర్ రింగ్ రోడ్డు మీదకు వెళ్లి నార్సింగి - మంచిరేవుల మధ్య కారును రోడ్డుపక్కన ఆపి గన్‌తో కాల్చుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయా? లేక మరేదైనా కారణమా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.