శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: గురువారం, 11 జులై 2019 (15:26 IST)

బాప్‌రే... ఎమ్మార్వో లావణ్య ఇంట్లో రూ.93 లక్షలా.... ఎలా వచ్చిందో కాస్త చెప్పమ్మా!!

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండల వీఆర్వో అనంతయ్య నాలుగు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డాడు. అనంతయ్య ఇచ్చిన సమాచారం ఆధారంగా హాయత్ నగర్‌లో నివాసం ఉండే కేశంపేట మండలం ఎం.ఆర్.వో లావణ్య ఇంటిపై సోదాలు నిర్వహించిన అధికారులకు అక్కడున్న సొమ్మును చూసి దిమ్మతిరిగిపోయింది. 
 
40 తులాల బంగారం. 93 లక్షల క్యాష్‌తో పాటు విలువైన భూమి పత్రాలు స్వాధీన పర్చుకున్నారు అధికారులు. ఒక ప్రభుత్వ అధికారి ఇంట్లో ఇంత భారీ ఎత్తున నగదు ఉండటం గడిచిన పదేళ్ల కాలంలో ఇదే తొలిసారని అధికారులు ఆశ్చర్యపోతున్నారు. దొరికిన డబ్బుకు వివరాలు కావాలని అధికారులు లావణ్యను అడుగగా ఆమె మౌనం వహించినట్టు తెలిసింది. లావణ్య భర్త  జీహెచ్ఎంసీలో సూరరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 
 
ఇక వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం దత్తాయపల్లికి చెందిన భాస్కర్ అనే రైతు సర్వే రికార్డుల్లో తన పొలం లేకపోవడంతో ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. సదరు పనికోసం వీఆర్వో రూ.8 లక్షలు లంచం ఇవ్వాలని రైతును డిమాండ్‌ చేయడంతో జూన్ 10వ తేదీన రూ. 30 వేలు లంచం ఇచ్చి మిగిలిన మొత్తం విడతల వారీగా ఇస్తానని అనంతయ్యకు చెప్పాడు. దీనికి అనంతయ్య సరేనని  చెప్పాడు. 
 
అయితే కొద్దిరోజుల క్రితం భాస్కర్ ఎసిబి అధికారులను కలిసి  ఫిర్యాదు చేశారు. మిగిలిన మొత్తం ఇచ్చేటప్పడు మాకు సమాచాంర ఇవ్వమని అధికారులు భాస్కర్‌కు చెప్పడంతో భాస్కర్‌ బుధవారం రూ. 4లక్షలతో కేశంపేట ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి అనంతయ్యకు లంచం ఇస్తుండగా ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకోవడంతో లావణ్య పట్టుబడింది. లావణ్య, అనంతయ్యలపై కేసు నమోదు చేశారు అధికారులు. అక్రమాస్తులు ఇంకా ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు అవినీతి నిరోధక శాఖ అధికారులు.