శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 7 మే 2019 (14:11 IST)

కక్కుర్తి ఖాకీలు... చలివేంద్రంలోని గ్లాసుల చోరీ

వేసవికాలంలో పాదాచారులు, బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటిని స్థానిక సంస్థలతో పాటు ఆయా ప్రాంతాలకు చెందిన యువత కలిసి ఏర్పాటు చేస్తుంటారు. పూరిపాక ఒకటి వేసి.. అందులో రెండు కొత్త మట్టి కుండల్లో నీరుపోసి.. ఆ నీటిని తాగేందుకు వీలుగా రెండు కుండలపై రెండు స్టీలు గ్లాసులు ఉంచుతారు. 
 
అయితే, తమిళనాడు రాష్ట్రంలోని పట్టుకోట్టైలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో పెట్టే స్టీల్ గ్లాసులు ప్రతి రోజూ మాయమైపోతూ వచ్చాయి. దీంతో దొంగలు ఎవరన్నదానిపై వారికి అంతుచిక్కలేదు. ఫలితంగా దొంగలను పట్టుకునేందుకు ఎవరికీ అనుమానంరాకుండా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా స్టీలు గ్లాసు దొంగలు ఎవరన్నది తేలిపోయింది. రాత్రి పూట విధులు నిర్వహించే ఇద్దరు కానిస్టేబుళ్లే ఈ కక్కుర్తికి పాల్పడినట్టు తేలింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సాధారణంగా ఎవరైనా దొంగతనం చేస్తే వారిని పట్టుకోవడం రక్షణభటుల కర్తవ్యం. కానీ, ఇక్కడ కంచె చేను మేస్తే అన్న చందంగా పోలీసులు నడుచుకున్నారు. చలివేంద్రంలోని స్టీలు గ్లాసులను పోలీసులు ఎత్తుకెళ్లడం ఇక్కడ విశేషం.. అది సీసీ కెమెరాలో రికార్డు అయింది.

ఈ వీడియో కాస్త ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ఇపుడు విపరీతంగా వైరల్ అయింది. అది ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. ఆ వీడియో చూసి ఖంగుతిన్న అధికారులు.. కక్కుర్తి కానిస్టేబుళ్ళపై బదిలీవేటు వేశారు.