1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (08:29 IST)

ఈసారి అదనపు కలెక్టర్ వంతు.. కుక్కకాటుతో తీవ్ర గాయాలు

dogs
తెలంగాణ రాష్ట్రంలో వీధి కుక్కల బెడద నానాటికీ ఎక్కువైపోతుంది. ఇటీవల హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత మరో దాడిలో మరికొందరు గాయపడ్డారు. ఇపుడు ఒక జిల్లా అదనపు కలెక్టర్ వంతు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట కలెక్టరేట్‌లో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. 
 
జిల్లా రెవెన్యూ విభాగంలో అదనపు కలెక్టరుగా విధులు నిర్వహించే శ్రీనివాస రెడ్డితో పాటు మరో ఇద్దరిని కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. కలెక్టర్‌ పెంపుడు శునకమూ తీవ్రంగా గాయపడింది. ఈ విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
 
సిద్దిపేట శివారులో కలెక్టరేట్‌తోపాటు అధికారుల నివాసాలు ఉన్నాయి. శనివారం రాత్రి అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి తాను నివాసముంటున్న క్వార్టర్స్‌ ఆవరణలో వాకింగ్‌ చేస్తుండగా ఓ వీధి కుక్క కరిచింది. ఆయన రెండు కాళ్లకు పిక్కల భాగంలో తీవ్ర రక్త గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఐసీయూలో ఉంచి పరిశీలనలో పెట్టారు. 
 
మరో వీధికుక్క అదేరోజు రాత్రి ఇంకో వ్యక్తిని, కలెక్టర్‌ పెంపుడు శునకాన్ని కరిచింది. కలెక్టరేట్‌కు సమీపంలోని పౌల్ట్రీఫాం వద్ద కూడా ఓ బాలుడు కుక్కకాటుకు గురయ్యాడు. దాంతో అధికారుల కుటుంబాల సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై సిద్దిపేట ఆసుపత్రి వర్గాలను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా అదనపు కలెక్టర్‌కు చికిత్స అందిస్తున్నామని తెలిపారు.