1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 డిశెంబరు 2020 (16:09 IST)

మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఏంటదో తెలుసా?

మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. న్యూ ఇయర్‌ కానుకగా గురువారం అర్థరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు తెరిచే ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొంది. మద్యం షాపులతో పాటు బార్లు, క్లబ్‌లకు రేపు (డిసెంబర్‌ 31) అర్థరాత్రి ఒంటిగంట వరకు అనుమతి ఇస్తున్నట్లు అబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
కరోనాతో పాటు కొత్త స్ట్రెయిన్ వైరస్‌ భారత్‌లోకి ప్రవేశించడంతో నూతన సంవత్సరం వేడుకలపై నిషేధాజ్ఞలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో మద్యం షాపులతో పాటు బార్లు, క్లబ్‌లు తెరిచే ఉండడమనేది మందుబాబులకు పెద్ద శుభవార్తే.
 
మరోవైపు.. పోలీసులు కూడా మద్యం సేవించి.. రోడ్డెక్కే వాహనదారుల తాట తీసేందుకు పోలీసులు రెడీ అయిపోతున్నారు. తాగి వాహనం నడిపితే కఠినంగా శిక్షిస్తామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు. తాగి బండి నడిపితే.. వారి ఆఫీసులకు సమాచారం చేరవేస్తామని, మొదటిసారి పట్టుబడితే..రూ. 10 వేలు ఫైన్, ఆరు నెలల జైలు శిక్ష, మూడు నెలల పాటు లైసెన్స్ రద్దు చేస్తామని పోలీసులు ప్రకటించారు. 
 
ఇక రెండోసారి పట్టుబడితే.. రూ.15 వేలు జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష, శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. మరోవైపు.. హైదరాబాద్ సిటీలో పోలీసు హై కమాండ్ ఆర్డర్ ప్రకారం.. పలు ప్రాంతాల్లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో కొంతకాలంగా నిలిపేసిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ను ప్రారంభించారు.