గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 జనవరి 2021 (09:05 IST)

బర్డ్ ఫ్లూ అంటే ఏంటి... మనషులపై కూడా ప్రభావం చూపుతుందా?

కరోనా దెబ్బకు వణికిపోతున్న ప్రజలకు ఇపుడు బర్డ్ ఫ్లూ రూపంలో మరో వైరస్ కలవరపెడుతుంది. ఈ వైరస్ దెబ్బకు కోళ్ళతో పాటు.. పక్షులు, బాతులు మృత్యువాతపడుతున్నాయి. ఫలితంగా చికెన్ ధరలు కూడా నేలచూపు చూస్తున్నాయి. రోజురోజుకూ పడిపోతున్న ధరలు పౌల్టీరంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. 
 
ముఖ్యంగా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళలో బర్డ్ ఫ్లూ ప్రభావం తీవ్రంగా ఉండడంతో చికెన్​తినేందుకు నగరవాసులు ఆసక్తి కనబరచడం లేదు. డిసెంబర్​లో కిలో చికెన్​రూ.250 పలుకగా నేడు రూ.150కి చేరుకుంది. కోడి గుడ్ల ధరలు సైతం అదేబాటలో పయనిస్తున్నాయి. 
 
భాగ్యనరంలో సాధారణ రోజుల్లో లక్ష కిలోల చికెన్​అమ్మకాలు జరుగుతుండగా ప్రస్తుతం సగానికి పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. మరో వైపు బాగా ఉడికించిన చికెన్ తీసుకుంటే ఎలాంటి రోగాలు దరిచేరవని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.
 
అస్సలు ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏవియన్ ఇంఫ్లుయెంజా అని పిలవబడే బర్డ్ ఫ్లూ కేవలం పక్షులనే కాదు, జంతువులు, మానవులపై కూడా ప్రభావం చూపగలదు. ఈ వైరస్ యొక్క చాలా ఫార్మ్స్ పక్షులకే పరిమితం. బర్డ్ ఫ్లూలో హెచ్5 ఎన్1 అనేది చాలా సర్వసాధారణం. 
 
ఇది పక్షులకి ప్రాణాంతకమైంది. ఈ వైరస్‌ను క్యారీ చేసే వాటితో జంతువులకు, మనుషులకు కూడా చాలా త్వరగా సోకుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం హెచ్5 ఎన్1 మొదటగా 1997లో మనుషుల్లో గుర్తించారు. ఇది సోకిన వారిలో సుమారుగా 60శాతం మంది మరణించారు. ప్రస్తుతం హెచ్5 ఎన్1 మనిషి నుంచి మనిషికి సోకడం లేదు.