శుక్రవారం, 5 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 ఆగస్టు 2023 (16:50 IST)

భారాస టిక్కెట్ ఇవ్వలేదని వేదికపై వెక్కి వెక్కి ఏడ్చిన మాజీ మంత్రి టి.రాజయ్య

rajaiah
వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి సోమవారం అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో పలువురికి టిక్కెట్లు ఇవ్వలేదు. వీరిలో మాజీ మంత్రి, స్టేషన్‌ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా ఉన్నారు. ఆయన మంగళవారం క్యాంపు కార్యాలయంలో తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ, ఒక్కసారిగా బోరున విలపించారు. ఆ తర్వాత కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ విగ్రహం ముందు పడుకుని వెక్కివెక్కి ఏడ్చారు. ఈ దృశ్యాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
గాతా ఈ నియోజకవర్గం నుంచి ఆయన గత 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. అయితే, ఈ దఫా ఆ స్థానం నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టిక్కెట్ కేటాయించారు. తనకు టిక్కెట్ దక్కకపోవడంతో రాజయ్య కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, ఇపుడు ఉన్న స్థానం కంటే మరింత ఉన్నత స్థానం కల్పిస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. అధినేత మాటను గౌరవించి ముందుకు సాగుతానని చెప్పారు. పైగా, ఆయన గీసిన గీతను తాను ఏనాడూ దాటలేదని చెప్పారు. 
 
లెఫ్ట్ పార్టీలకు మొండిచేయి చూసిన సీఎం కేసీఆర్
 
ఈ యేడాది ఆఖరులో తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార తెరాస పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుంది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను కూడా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఆ పార్టీ ఒంటరిగానే పోటీ చేసి ముచ్చటగా మూడోసారి గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తుంది. దీంతో లెఫ్ట్ పార్టీల నేతలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. 
 
మునుగోడు ఉప ఎన్నికలో సీపీఐ, సీపీఎంలు సీఎం కేసీఆర్ పార్టీకి మద్దతు ఇచ్చి ఆ పార్టీ విజయానికి కృషి చేశాయి. అప్పటి నుంచి భారాస, వామపక్షాల మధ్య మైత్రి ప్రారంభమైంది. కానీ కేసీఆర్ భారాస అభ్యర్థుల జాబితాను ప్రకటించేయడంతో వామపక్షాలు ఖంగుతిన్నాయి. సీపీఐ, సీపీఎంలు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్‌లో ఉమ్మడిగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవాలని నిర్ణయించాయి. 
 
సీట్ల సర్దుబాటుపై కొద్దిరోజుల క్రితం భారాస, వామపక్ష నేతల మధ్య చర్చలు జరిగాయి. సీపీఎం, సీపీఐలకు ఒక్కో ఎమ్మెల్యే స్థానం, రెండేసి ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని భారాస ప్రతిపాదించింది. సీఎం కేసీఆర్ ప్రతిపాదనను తోసిపుచ్చిన లెఫ్ట్ నేతలు తలా మూడు అసెంబ్లీ స్థానాలకు పట్టుబట్టారు. కనీసం రెండేసి అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండేసి ఎమ్మెల్సీ స్థానాలైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎమ్మెల్సీ సీట్లకు బదులు 3 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని సీపీఐ కోరింది. 
 
సీపీఎంకు భద్రాచలం, సీపీఐకి మునుగోడు ఇస్తామని భారాస ప్రతిపాదించింది. వీటికి అదనంగా పాలేరు, మిర్యాలగూడెంలో ఏదో ఒకటి ఇవ్వాలని సీపీఎం.. కొత్తగూడెం, బెల్లంపల్లి, హుస్నాబాద్ ఒకటి చొప్పున ఇవ్వాలని సీపీఐ కోరాయి. కానీ ఒక్కో అసెంబ్లీ స్థానం, రెండేసి ఎమ్మెల్సీ సీట్లు మాత్రమే ఇస్తామని భారాస పేర్కొనడంతో చర్చలు ఫలించలేదు. ఇపుడు భారాస ఒంటిరిగా పోటీ చేయనుంది.