1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 జనవరి 2022 (14:35 IST)

తెలంగాణ జ్వర సర్వే: ప్రశంసలు కురిపించిన కేంద్రం

కరోనాను నియంత్రించే క్రమంలో తెలంగాణ సర్కారు చేపట్టిన జ్వరం సర్వేపై కేంద్రం ప్రశంసల జల్లు కురిపించింది. కరోనా నివారణకు ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతిని మంచి వ్యూహంగా కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుక్ మండవీయ అభినందించారు. 
 
ఇదే విధానాన్ని అన్ని రాష్ట్రాలలో అనుసరించేందుకు విధాన రూపకల్పన చేస్తామని.. ఆ దిశగా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
 
రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై కేంద్ర వైద్యారోగ్య మంత్రి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో తెలంగాణ తరుపున వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఖమ్మం కలెక్టరేట్ నుండి పాల్గొన్నారు.
 
రాష్ట్రంలో కరోనా పరిస్ధితులు, ప్రభుత్వం సన్నద్ధత, జ్వర సర్వే, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై మంత్రి కేంద్ర మంత్రిత్వ శాఖకు వివరించారు.
 
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మరోసారి జ్వర సర్వే ప్రారంభించుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లు, రెండు కోట్ల టెస్టింగ్ కిట్లు సమకూర్చుకున్నట్లు తెలిపారు. 
 
జ్వర సర్వే తో ప్రభుత్వం వైద్యాన్ని ఇంటి వద్దకే చేర్చిందనీ, దీని వల్ల పాజిటివిటి రేటు తగ్గి, హాస్పిటలైజేషన్ తగ్గిందని చెప్పారు.
 
లక్షణాలు ఉన్న వారు ప్రభుత్వం ఇస్తున్న హోమ్ ఐసోలేషన్ కిట్లు వినియోగించడం వల్ల మూడు, నాలుగు రోజుల్లో కోలుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతున్నట్లు మంత్రి వివరించారు.