1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 మార్చి 2022 (22:02 IST)

బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఇంట్లో నలుగురి కిడ్నాప్

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన జితేందర్ రెడ్డికి చెందిన ఢిల్లీ నివాసంలో నలుగురు కిడ్నాప్‌కు గురయ్యారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో ఉండే వారిలో ఏకంగా నలుగురు కిడ్నాప్‌కు గురికావడం ఇపుడు కలకలం రేపుతుంది. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. కిడ్నాప్‌కు గురైనవారిలో జితేందర్ రెడ్డి కారు డ్రైవర్‌తో సహా నలుగురు ఉన్నారు. ఈ కిడ్నాప్ ఘటనపై జితేందర్ రెడ్డి ఢిల్లీ ఫిర్యాదు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీ సౌత్ అవెన్యూలోని 105 నంబరు ఇంటిలో జితేందర్ రెడ్డి నివాసం ఉంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు ఆ ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించి జితేందర్ రెడ్డి కారు డ్రైవర్ సహా నలుగురు వ్యక్తులను బలవంతంగా కిడ్నాప్ చేశారు. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకున్న జితేందర్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది సమీపంలోని పోలీస్ స్టేషనుకెళ్లి ఫిర్యాదు చేశారు. దీనిపై ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు.