1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 మార్చి 2022 (12:51 IST)

భారతీయ అమ్మాయిలను ఎత్తుకెళుతున్న రష్యా సైన్యం

ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. మంగళవారానికి ఆరో రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. అయినప్పటికీ ఉక్రెయిన్ సేనలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ పౌరులు, విద్యార్థులు అక్కడ నుంచి బయటపడేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. వీరి తరలింపునకు కేంద్ర ప్రత్యేక ప్రణాళికను ఖరారు చేసినప్పటికీ ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా సైనికులు భారతీయ విద్యార్థులు, పౌరులను చిత్రహింసలు పెడుతున్నారు. 
 
ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి బయటపడేందుకు పొరుగుదేశాలైన పోలాండ్, రొమేనియా వంటి దేశాల సరిహద్దుల వద్దకు చేరుకుంటున్న భారతీయ విద్యార్థినులను రష్యా సైనికులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. తమ స్నేహితులపై రష్యా సైనికులు కాల్పులు జరిపారని సహచర విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అలాగే, మరికొందరు యువతులను రష్యా సైనికులు గుర్తు తెలియని ప్రాంతానికి ఎత్తుకెళ్లారని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోకు చెందిన ఓ యువతి బోరున విలపిస్తూ పేర్కొంది. 
 
"ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. భారత సైన్యాన్ని ఇక్కడికి పంపించి మమ్మల్ని కాపాడండి" అంటూ ఓ సెల్ఫీని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా, దాన్ని కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంకా గాంధీ వాద్రా షేర్ చేశారు.