1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 24 జులై 2020 (16:46 IST)

కారు ఎక్కించుకుని ఆమె చేతిలో బీర్ బాటిల్ పెట్టాడు, సెల్ఫీ తీసి బ్లాక్ మెయిలింగ్

స్నేహం నటిస్తూ సెల్ఫీలు తీసుకున్నాడు.. ఓ సారి బీరు బాటిల్‌ చేతిలో పెట్టి ఫొటో తీశాడు. తాను చెప్పినట్లు వినకపోతే వాటిని సోషల్‌ మీడియాలో పెట్టి పరువు తీస్తానని బెదిరించాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.
 
యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో స్నేహంగా ఉన్నట్లు నటించాడు. పలుమార్లు సెల్ఫీలు తీసుకున్నాడు. ఓసారి ఆ యువతిని తన కారులో చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల్లో తిప్పాడు. సరదాగా అంటూ యువతి చేతిలో బీరు బాటిల్‌ పెట్టి ఫొటోలు తీశాడు. 
 
కొద్దిరోజుల తర్వాత నిందితుడు యువతికి ప్రపోజ్‌ చేశాడు. ఆమె అంగీకరించలేదు. అప్పటి నుంచీ దూరంగా ఉంటోంది. సెల్ఫీలు, బీరు బాటిల్‌తో దిగిన ఫొటోలు అడ్డం పెట్టుకొని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడేవాడు.
 
తాను చెప్పినట్లు వినకపోతే.. ఫొటోలు సోషల్‌ మీడియాలో పెట్టి పరువు తీస్తానని, వాటిని మార్ఫింగ్‌ చేసి తల్లిదండ్రులకు, బంధువులకు పంపిస్తానని బెదిరించాడు. అతని వేధింపులు భరించలేని యువతి రాచకొండ సైబర్‌ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఏసీపీ హరినాథ్‌ పర్యవేక్షణలో రంగంలోకి దిగిన ఇన్‌స్పెక్టర్‌ రాము టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా నిందితుని అదుపులోకి తిసుకుని రిమాండ్‌కు తరలించారు.