1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 జులై 2020 (11:36 IST)

స్నేహంగా నటిస్తూ సెల్ఫీలు.. చేతిలో బీరు బాటిల్ పెట్టి ఫోటో.. ఆపై బ్లాక్‌మెయిల్

వక్రబుద్ధి కలిగిన ఓ యువకుడు.. ఓ యువతిపై కన్నేశాడు. ఆమెను ఎలాగైనా అనుభవించాలని ప్లాన్ వేశాడు. ఇందులోభాగంగా, ఆ యువతితో స్నేహం చేస్తున్నట్టు నటించాడు. ఆ స్నేహం పేరుతో సెల్ఫీలు దిగాడు. ఆ తర్వాత చేతిలో బీరుబాటిల్ పెట్టి ఫోటో తీశాడు. ఈ ఫోటోను చూపించి, బ్లాక్ మెయిల్ చేయసాగాడు. తన కోరిక తీర్చకుంటే ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటా బెదిరించసాగాడు. చివరకు అతని వేధింపులు భరించలేని ఆ యువతి సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ బ్లాక్‌మెయిలర్‌ను అరెస్టు చేసి కటకటాలవెనక్కి పంపించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, హయత్‌నగర్‌ తట్టి అన్నారం ప్రాంతానికి చెందిన అశ్వక్‌ ఆలీషేక్‌ మారుతీనగర్‌లో ఉంటున్నాడు. ఫేస్‌బుక్‌ ద్వారా ఇంటికి సమీపంలోని యువతితో పరిచయం పెంచుకున్నాడు. 
 
ఆమెతో స్నేహంగా ఉన్నట్లు నటించాడు. పలుమార్లు సెల్ఫీలు తీసుకున్నాడు. ఓ సారి ఆ యుతిని తన కారులో చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల్లో సరదాగా తిప్పాడు. సరదాగా అంటూ యువతి చేతిలో బీరు బాటిల్‌ పెట్టి ఫొటోలు తీశాడు. 
 
కొద్దిరోజుల తర్వాత నిందితుడు యువతికి ప్రపోజ్‌ చేశాడు. ఆమె అంగీకరించలేదు. అప్పటి నుంచీ దూరంగా ఉంటోంది. దాంతో సెల్ఫీలు, బీరు బాటిల్‌తో దిగిన ఫొటోలు అడ్డం పెట్టుకొని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడసాగాడు. 
 
తాను చెప్పినట్లు వినకపోతే.. ఫొటోలు సోషల్‌మీడియాలో పెట్టి పరువు తీస్తానని, వాటిని మార్ఫింగ్‌ చేసి తల్లిదండ్రులకు, బంధువులకు పంపిస్తానని బెదిరించాడు. అతని వేధింపులు భరించలేని యువతి రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఏసీపీ హరినాథ్‌ పర్యవేక్షణలో రంగంలోకి దిగిన ఇన్‌స్పెక్టర్‌ రాము టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా నిందితుని ఆటకట్టించి కటకటాల్లోకి నెట్టారు.