శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 మే 2020 (20:07 IST)

సైబర్ నేరగాడి వలలో హైదరాబాద్ లేడీ ... రూ.12.45 లక్షలు కొట్టేశాడు

నైజీరియాకు చెందిన ఓ సైబర్ నేరగాడివలలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి పడింది. తాను లండన్‌లో ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నానని, నిన్ను పెళ్ళి చేసుకుని హైదరాబాద్‌లో సెటిలైపోతానని నమ్మించాడు. పైగా, పెళ్లికి కావాల్సిన బంగారు, వజ్రాలు తీసుకొస్తానని హామీ ఇచ్చాడు. అతని మాటలను పూర్తిగా విశ్వసించిన ఆ యువతి ఏకంగా 12.45 లక్షల రూపాయలను సమర్పించుకుంది. చివరకు తాను మోసపోయానని తెలుసుకుని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, బోరబండలో నివాసముంటున్న ఓ యువతి కొద్దినెలల కిందట భారత్‌ మ్యాట్రిమొనీలో తన వివరాలను నమోదు చేసుకుంది. గత నెల 2న ఆమె వ్యక్తిగత వివరాలు పరిశీలించిన ఓ వ్యక్తి తాను లండన్‌లో స్థిరపడిన ఇంజినీరునని పరిచయం చేసుకున్నాడు. 
 
తన పేరు కెల్లీహేరీ అని.. ఇష్టమైతే పెళ్లి చేసుకుంటానని, పెళ్లయ్యాక హైదరాబాద్‌లో ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేద్దామని వివరించాడు. అప్పటి నుంచి ఇద్దరూ వాట్సాప్‌ ద్వారా మాట్లాడుకుంటున్నారు. గత నెల 12న బాధితురాలికి ఫోన్‌చేసి, పెళ్లి ఖర్చుల నిమిత్తం 85 వేల పౌండ్లు(భారత కరెన్సీలో రూ.61 లక్షలు), వజ్రాలు, బంగారు బిస్కెట్లు పంపుతున్నానంటూ నమ్మించాడు. 
 
ఆ తర్వాత కొద్దిగంటలకే ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్‌ అధికారులమంటూ ఆ యువతికి ఓ వ్యక్తి ఫోన్‌ చేసి, మీ కానుకలు వచ్చాయని, ముందుగా రూ.28 వేలు చెల్లించాలని చెప్పగా.. ఆమె అలాగే చేసింది. అలా వివిధ రుసుముల పేరుతో 10 రోజుల వ్యవధిలో రూ.12.45 లక్షల నగదు బదిలీ చేయించుకున్నాడు. రోజులు గడుస్తున్నా ఇంటికి బహుమతులు రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది.