1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 మే 2022 (12:20 IST)

పుట్టిన రోజు నాడే ఆమెకు చివరి రోజు.. రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు దాటుతూ..?

పుట్టిన రోజు నాడే ఆ మహిళ మరణించింది. సాయంత్రం బర్త్ డే పార్టీ చేసుకుందామని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లిన మహిళ విగతజీవిగా ఇంటికి చేరడంతో ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన ఖైరతాబాదులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... మహారాష్ట్ర షోలాపూర్ ప్రాంతానికి చెందిన లావణ్య ఇద్దరు కూతుళ్లు, తండ్రి, సోదరుడితో కలిసి ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చింది. వీరంతా ఖైరతాబాద్ తుమ్మలబస్తీలో అద్దెకుంటున్నారు. లావణ్య ఖైరతాబాద్‌లోనే ఓ కంపనీలో టెలీకాలర్‌గా పనిచేస్తోంది. ఆమె తండ్రి, సోదరుడు కూడా పనులు చేస్తున్నారు. ఇలా ఆనందంగా సాగుతున్న వీరి జీవితంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. 
 
బుధవారం లావణ్య పుట్టినరోజు కావడంతో అందంగా ముస్తాబై ఫోటో తీసుకుంది. కూతుళ్లు, తండ్రి, సోదరుడు పుట్టినరోజు విషెస్ తెలుపగా సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చాక బర్త్ డే పార్టీ చేసుకుందామని చెప్పింది. ఇలా ఆఫీస్‌కు బయలుదేరిన లావణ్య తిరిగి ఇంటికి చేరుకోలేదు.   
 
ఆఫీస్ కు వెళుతూ ఖైరతాబాద్ రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు దాటుతుండగా ఒక్కసారిగా ఎంఎంటీఎస్ ట్రెయిన్ వేగంగా దూసుకొచ్చింది. తప్పించుకునే క్రమంలో దాదాపు పట్టాలు దాటేసినా రైలు వేగానికి ఒక్కసారిగా ఎగిరి కిందపడింది. 
 
పట్టాలపై వుండే రాళ్లు తలకు తగలడంతో తీవ్రంగా గాయపడిన లావణ్య అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది.  పుట్టినరోజునే లావణ్య మృతిచెందడంతో తీవ్ర విషాదం  నెలకొంది.