1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 15 నవంబరు 2021 (22:24 IST)

బాధ్యతారాహిత్యంగా బండి సంజయ్: మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్

రాష్ట్రంలో గొర్రెల పంపిణీపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం తగని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు.

హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని పశు సంక్షేమ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. గొల్ల, కురుమల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో 2017లో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించామన్నారు.

అప్పుడు రూ.వెయ్యి కోట్లు ఇస్తామని హామీ ఇచ్చిన కేంద్రం ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. ఈ పథకం కింద మొదటి విడతలో ప్రభుత్వ పూచీకత్తుపై ఎన్‌సీడీసీ ద్వారా రూ.3,549.98 కోట్లు రుణం తీసుకున్నామని తెలిపారు.

ఆ అప్పుకు సంబంధించి ఇప్పటిదాకా అసలు, వడ్డీ కలిపి 9 వాయిదాల్లో రూ.2,900.74 కోట్లు ఎన్‌సీడీసీకి చెల్లించామని స్పష్టం చేశారు. రెండో విడత అమలు కోసం లబ్ధిదారుల వాటా మినహాయించి రూ.4,593.75 కోట్ల రూపాయలు మంజూరు చేయాలన్న విజ్ఞప్తిపై ఎన్‌సీడీసీ అధికారుల బృందం క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చి సంతృప్తి వ్యక్తం చేసినట్లు మంత్రి తెలిపారు.

అంతేకాకుండా రుణం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని స్పష్టం చేశారు. ఈ పథకం ఇంత గొప్పగా అమలవుతున్న తరుణంలో బండి సంజయ్‌ తరచూ ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారో అర్థకం కావడం లేదని మండిపడ్డారు.

అబద్ధాలు ఆడే వ్యక్తిని ఎందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టుకున్నారో పార్టీ అధిష్ఠానం ఆలోచించాలని సూచించారు. ధైర్యం ఉంటే దేశవ్యాప్తంగా గొర్రెల పంపిణీ అభివృద్ధి పథకాన్ని అమలు చేయాలని సవాల్‌ విసిరారు. 

యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలోనూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సైతం అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.